పామర్తి బాటలో మరికొందరు

ABN , First Publish Date - 2021-11-29T06:37:56+05:30 IST

మైలవరంలో వైసీపీ నేతల రాజీనామాల పర్వం కొనసాగనుంది.

పామర్తి బాటలో మరికొందరు

మైలవరంలో రాజీనామాల పర్వం 

రాజీనామా యోచనలో మూడు మండలాల కన్వీనర్లు

వసంత తీరుపై వైసీపీ నేతల అసంతృప్తి


విజయవాడ, నవంబరు 28 : మైలవరంలో వైసీపీ నేతల రాజీనామాల పర్వం కొనసాగనుంది. ఇప్పటికే ఏఎంసీ చైర్మన్‌ పదవికి, మైలవరం మండల కన్వీనర్‌ పదవికి పామర్తి శ్రీనివాసరావు మూడు రోజుల క్రితం రాజీనామా చేయగా, ఇప్పుడు మరో మూడు మండలాల కన్వీనర్లు ఆయన బాటలో నడవనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ నందిగామ నియోజకవర్గం నుంచి తన సొంత మనుషులను తీసుకువచ్చి ఈ నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జిలుగా నియమించడం, వారు తమను అవమానించడాన్ని భరించలేక మైలవరం ఏఎంసీ చైర్మన్‌ పదవికి, మండల కన్వీనర్‌ పదవికి పామర్తి శ్రీనివాసరావు మూడు రోజుల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరి కొంతమంది మండలస్థాయి నాయకులు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఆదివారం ఒక ప్రాంతంలో రహస్యంగా సమావేశమైన పలువురు మండల కన్వీనర్లు, ఎస్సీ, బీసీ, మైనార్టీ నేతలు వారి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్టు వినికిడి. ఇన్‌చార్జ్‌ల అవినీతి, ఆగడాలు పెరిగిపోవడం, తమపై పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ వర్గం అని ముద్ర వేసి, చిన్నచూపు చూడటం, ఎమ్మెల్యే సొంత బామ్మర్ది పెత్తనం శ్రుతిమించడం వంటివి ఆదినుంచీ పార్టీ జెండాలు మోసిన వైసీపీ నాయకులకు రుచించడం లేదు. ఇంతకాలం ఎలాగోలా భరిస్తూ వచ్చిన స్థానిక నాయకులు ఇక భరించలేమంటున్నారు. ఎమ్మెల్యే వసంత ఒంటెత్తు పోకడలను, ఆయన అనుచరుల అక్రమాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమ అసమ్మతిని పార్టీ పెద్దలకు తెలియజేయాలనే స్థానిక నాయకులు రాజీనామాల బాట పట్టినట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-11-29T06:37:56+05:30 IST