హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై వైసీపీ మౌనమేల?

ABN , First Publish Date - 2022-08-09T06:22:23+05:30 IST

కొయ్యూరు-చింతపల్లి సరిహద్దులోని యర్రవరం అటవీ ప్రాంతంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై వైసీపీ ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండడం సరికాదని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.

హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై వైసీపీ మౌనమేల?
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

ఆదివాసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు

నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి 


చింతపల్లి, ఆగస్టు 8: కొయ్యూరు-చింతపల్లి సరిహద్దులోని యర్రవరం అటవీ ప్రాంతంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై వైసీపీ ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండడం సరికాదని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆదివాసీల మనుగడకు ముప్పు తెచ్చే ఈ ప్రాజెక్టుపై వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. గొందిపాకలు పంచాయతీలో సర్పంచ్‌ సాగిన వరలక్ష్మి అధ్యక్షతన సోమవారం అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం, జేఏసీ నాయకులు ముందస్తు ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఒక్క అవకాశం కల్పించాలనే జగన్‌ అభ్యర్థన మేరకు ఆదివాసీలు భారీ మెజారిటీని కట్టబెట్టారన్నారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం మాట మార్చడం అన్యాయమని వాపోయారు. గిరిజన సంపద, వనరులను దోచుకునేందుకు చాపకింద నీరులా కార్యచరణ అమలు చేస్తున్నారని, హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పేరిట సుమారు 72 గిరిజన గ్రామలను ఖాళీ చేయించేందుకు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. యర్రవరం వద్ద హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మించి కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గ్రామ సభ తీర్మానం, నిర్వాసిత గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులు మందజూరు చేశారంటే ప్రభుత్వానికి ఆదివాసీలపై చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదన్నారు. గిరిజనులకు నష్టం కలిగించే హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, లేదంటే నిర్వాసిత గ్రామాల ప్రజలతో ప్రాణత్యాగానికైనా వెనుకాడబోమని ఆమె హెచ్చరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మానవహక్కుల వేదిక సమన్వయకర్త కృష్ణ మాట్లాడుతూ, ఆదివాసీల జీవన విధానానికి విఘాతం కలిగించేలా ప్రభుత్వాలు వ్యవహరించరాదన్నారు. ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ రామన్నదొర మట్లాడుతూ, గిరిజన సంపద పరిరక్షణకు పోరాటాలే శరణ్యమన్నారు. అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి మాట్లాడుతూ గిరిజన హక్కులు, చట్టాలను పరిరక్షణకు ఆదివాసీలు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చల్లంగి జ్ఞానేశ్వరి, లక్ష్మణరావు, కిల్లో పూర్ణచంద్రరరావు, ఆదివాసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి మోట్టడం రాజబాబు, గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు బౌడు గంగరాజు, జిల్లా నాయకులు లోచలి రామకృష్ణ, గిడ్డి వరలక్ష్మి, సింహాచలం, కిల్లో రామ్మూర్తినాయుడు, గ్రామ పెద్దలు జనకాని రామరావు, అబ్బాయిదొర, కుశలవుడు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T06:22:23+05:30 IST