టీటీడీ అటవీ కార్మికుల దీక్షకు ఏడాది

ABN , First Publish Date - 2021-11-26T06:49:28+05:30 IST

తమ సమస్యల పరిష్కారం కోసం టీటీడీ అటవీ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో ఏడాది పూర్తికానున్నాయి.

టీటీడీ అటవీ కార్మికుల దీక్షకు ఏడాది
మీడియాతో మాట్లాడుతున్న సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మురళి

సమస్యలు పరిష్కరించాల్సిందేనని సీఐటీయూ డిమాండ్‌ 

నేడు భారీ నిరసన 


తిరుపతి(కొర్లగుంట), నవంబరు 25: తమ సమస్యల పరిష్కారం కోసం టీటీడీ అటవీ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో ఏడాది పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో భారీ నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. దీనిపై గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కందరాపు మురళి మీడియాతో మాట్లాడారు. ఏడాదిగా దీక్షలు చేస్తున్నా టీటీడీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. టైంస్కేల్‌ అమలు చేస్తామని టీటీడీ బోర్డు తీర్మానించి రెండేళ్లవుతోందని.. సమాన పనికి-సమాన వేతనం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి ఏడాదిన్నర అవుతోందని.. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలకు మూడేళ్లు అయినా కార్మికులకు మాత్రం న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాల మేరకు కార్మికులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించి, తరువాత ఆ యోచన లేదని మాటతప్పడం ఏంటని ప్రశ్నించారు. కార్పొరేషన్‌లో విలీనం కావాలని ఈవో జవహర్‌రెడ్డి సలహాలివ్వడం, జేఈవో సదాభార్గవి ఒత్తిడిచేయడం తగదన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందేనని డిమాండు చేశారు. వీరి దీక్షకు ఏడాదవుతున్న సందర్భంగా చేపట్టే భారీ నిరసనలో టీటీడీలోని అన్నిసంఘాలు, ప్రజాసంఘాలు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీటీడీ ఫారెస్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కె.సురేష్‌, ప్రధాన కార్యదర్శి ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-26T06:49:28+05:30 IST