అది నిజమే : Sri Lanka ప్రధాన మంత్రి

ABN , First Publish Date - 2022-07-05T22:41:31+05:30 IST

శ్రీలంక (Sri Lanka) దివాలా తీసినట్లు ఆ దేశ ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే

అది నిజమే : Sri Lanka ప్రధాన మంత్రి

కొలంబో : శ్రీలంక (Sri Lanka) దివాలా తీసినట్లు ఆ దేశ ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) పార్లమెంటుకు మంగళవారం తెలిపారు. ఈ ఆర్థిక సంక్షోభం కనీసం వచ్చే సంవత్సరం చివరి వరకు కొనసాగవచ్చునని చెప్పారు. శ్రీలంక కొద్ది నెలల నుంచి ద్రవ్యోల్బణం, విద్యుత్తు కోతలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. 


శ్రీలంకలోని దాదాపు 2 కోట్ల 20 లక్షల మంది ప్రజలు కొద్ది నెలల నుంచి ద్రవ్యోల్బణం, సుదీర్ఘ విద్యుత్తు కోతలతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలను దిగుమతి చేసుకోవడానికి అవసరమైన విదేశీ కరెన్సీ ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదు.  


విక్రమసింఘే మాట్లాడుతూ, ఒకప్పటి సౌభాగ్యవంతమైన శ్రీలంక ఈ సంవత్సం తీవ్ర ఆర్థికమాంద్యంలోకి వెళ్తుందన్నారు. ఆహారం, ఇంధనం, మందుల కొరత కొనసాగుతుందని చెప్పారు. 2023లో కూడా కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుందన్నారు. ఇది సత్యమని, ఇది వాస్తవమని తెలిపారు. 


బెయిల్ ఔట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF)తో చర్చల గురించి మాట్లాడుతూ, రుణదాతలతో రుణాల రీస్ట్రక్చరింగ్ ప్లాన్‌ను ఆగస్టునాటికి ఖరారుచేయడంపై ఇది ఆధారపడి ఉందని చెప్పారు. దివాలా తీసిన దేశంగా చర్చల్లో పాల్గొంటున్నామని చెప్పారు. దేశం నిలకడగా అభివృద్ధి మార్గంలో ఉన్నట్లు తెలిపే ప్రణాళికను ఐఎంఎఫ్‌కు వేరుగా  సమర్పించవలసి ఉందని చెప్పారు. ఈ ప్రణాళిక పట్ల ఐఎంఎఫ్ సంతృప్తి చెందితేనే ఓ ఒప్పందం కుదురుతుందన్నారు. 


శ్రీలంక ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే చాలా కృషి జరగాలని గత వారం ఐఎంఎఫ్ తెలిపింది. చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తగిన ఏర్పాట్లు చేయవలసి ఉందని పేర్కొంది. ఆ తర్వాత మాత్రమే ఒప్పందం కుదర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. 


ఇదిలావుండగా, పెరుగుతున్న ధరలు, ఆహార కొరతను భరించలేక దాదాపు 80 శాతం మంది శ్రీలంక ప్రజలు భోజనం చేయడం మానేస్తున్నారని ఐక్యరాజ్య సమితి (United Nations) అంచనా వేసింది. 


Updated Date - 2022-07-05T22:41:31+05:30 IST