Bomb threat: యోగి ఆదిత్యనాథ్కు బాంబు బెదిరింపు
ABN , First Publish Date - 2022-08-13T21:54:10+05:30 IST
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు శనివారంనాడు బాంబు బెదిరింపు లేఖ..
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)కు శనివారంనాడు బాంబు బెదిరింపు లేఖ వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం, లక్నోలోని అలీంబాగ్ నివాసి అయిన దేవేంద్ర తివారీ ఇంట్లోని బ్యాగులో ఈ బెదిరింపు లేఖను గుర్తించారు.ముఖ్యమంత్రి యోగి, దేవేంద్ర తివారీని పేల్చేస్తామంటూ ఆ లేఖలో రాసి ఉంది.
కాగా, ''ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్'' హోర్డింగులపై యోగి ఆదిత్యనాథ్ ముఖానికి మసిపూసి ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు శనివారంనాడు రెండు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మూడు హోర్డింగ్లలో ముఖ్యమంత్రి ముఖాన్ని తొలగించారని, దీనిపై రెండు ఎప్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా మెజిస్ట్రేట్ రవి రంజన్ తెలిపారు. సమాచారం తెలియగానే పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని హోర్డింగ్లను మార్చారు. హోర్డింగ్లను డ్యామేజ్ చేసిన వారిని కనిపెట్టేందుకు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఆరు చోట్ల హోర్డింగ్లపై మసిపూశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ షాంఖ్వార్ తెలిపారు.