మీరు ఓకే.. కేడర్‌ను కదిలించండి

ABN , First Publish Date - 2022-10-08T03:41:36+05:30 IST

మీ పనితీరు బాగుంది. నియోజక వర్గంలో పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. మీరు హాజరైన కార్యక్రమాల కు స్థానిక నాయకత్వం కదులుతోంది. కానీ స్వతంత్రంగా ఎవరికి వారు తగు స్థాయిలో స్పందించడం లేదు.

మీరు ఓకే.. కేడర్‌ను కదిలించండి
చంద్రబాబుతో ముఖాముఖిలో కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి

సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి

ప్రభుత్వ వ్యతిరేకతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఎమ్మెల్యే స్వామితో ముఖాముఖిలో టీడీపీ అధినేత చంద్రబాబు

ఒంగోలు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ‘మీ పనితీరు బాగుంది. నియోజక వర్గంలో పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. మీరు హాజరైన కార్యక్రమాల కు స్థానిక నాయకత్వం కదులుతోంది. కానీ స్వతంత్రంగా ఎవరికి వారు తగు స్థాయిలో స్పందించడం లేదు. ఇది మారాలి. కేడర్‌ ఎక్కడికక్కడ స్థానికంగా కదిలి పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో చురుగ్గా వారు పనిచేసేలా చూడాలి’ అని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. నియోజకవర్గాల వారీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో ముఖాముఖి నిర్వహిస్తున్న అధినేత శుక్రవారం కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామితో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సమీక్షించారు. అందిన సమాచారం మేరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు, పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో గెలుపుపై పార్టీపరంగా చేసిన సర్వేలలో సానుకూల ఫలితం ఉందని అధినేత సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు స్థానికంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం చురుగ్గా ఎవరికి వారు కార్యక్రమాలను నడపడంలో ఆశించినంతగా కదలిక లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీ వ్యవహారశైలి, ఇటీవల తనపై వారు ఆరోపణలు చేస్తున్న తీరు, అదే సమయంలో పార్టీ తరఫున చేపడుతున్న కార్యక్రమలు, తనకు అండగా యువనేత దామచర్ల సత్య, పూర్ణచంద్రరావుల భాగస్వామ్యం తదితర అంశాలను అధినేతకు డాక్టర్‌ స్వామి వివరించారు. సత్య సహకారం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన అధినేత అదే ఒరవడిలో కొనసాగాలని, పార్టీ అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని మరింతగా ప్రోత్సహిస్తామని చెప్పినట్లు సమాచారం. 



Updated Date - 2022-10-08T03:41:36+05:30 IST