పెళ్లయిన వాడిని ప్రేమించి.. అతని భార్యను వేధించి...!
ABN , First Publish Date - 2021-05-25T12:27:11+05:30 IST
పెళ్లయిన వ్యక్తిని ప్రేమించిందే కాకుండా..
హైదరాబాద్ సిటీ : పెళ్లయిన వ్యక్తిని ప్రేమించిందే కాకుండా.. అతని భార్యను వేధించిన ఓ యువతి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ హయత్నగర్ ప్రాంతానికి చెందిన నేహ అలియాస్ బ్లెస్సీ.. ఎంఎన్సీ కంపెనీలో టీమ్లీడర్గా పనిచేస్తుంది. ఐటీలో పనిచేస్తుండటంతో లగ్జరీ లైఫ్కు అలవాటుపడింది. ఇటీవల లాక్డౌన్ కారణంగా ఆమె ఉద్యోగం పోయి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆమెకు జిమ్సెంటర్లో ఓ వ్యక్తి పరిచయం అయ్యా డు. అతను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె అతనితో ఉన్న స్నేహాన్ని ప్రేమగా మార్చుకుంది. కొంతకాలం తర్వాత అతనికి పెళ్లయిందని, భార్య ఉందని తెలిసింది. దాంతో వారి కాపురాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు పెట్టింది. అప్పటినుంచి అతను ఆమెతో మాట్లాడటం మానేశాడు. కాంటాక్టులు కట్ చేశాడు.
ఇదిలా ఉండగా.. ఎలాగైనా అతన్ని దక్కించుకొని సెటిలైపోవాలనుకున్న నేహ కొత్తఫోన్ నంబర్లను తీసుకొని, నకిలీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను క్రియేట్ చేసింది. అతనితో తనకు వివాహేతర సంబంధం ఉందని, అతని భార్యకు, ఆమె కుటుంబ సభ్యులకు పోస్టులు పెట్టేది. అశ్లీల చిత్రాలు, అసభ్య మెసేజ్లు పంపేది. ఎలాగైనా అతని నుంచి భార్య విడిపోవాలని కొత్తకొత్త పోస్టులను క్రియేట్ చేసి వేధించేది. దాంతో ఆ మహిళ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితురాలు నేహాను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా భార్యా భర్తలను విడదీస్తే అతను తనవైపు వస్తాడనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు ఒప్పుకుంది. దాంతో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు.