దారుణం.. దుస్తులు ఊడదీసి మరీ నడిరోడ్డుపై ఈ యువకుడిని చితకబాదడం వెనుక.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-06-30T02:00:28+05:30 IST
తమ కుటుంబానికి చెందిన యువతితో మాట్లాడాడనే కోపంతో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు..
తమ కుటుంబానికి చెందిన యువతితో మాట్లాడాడనే కోపంతో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు.. యువకుడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తమ ఇంటికి తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు.. దుస్తులు ఊడదీసి మరీ నడిరోడ్డుపై చితక్కొట్టారు.. ఆ యువకుడి కాలు విరిచేశారు.. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశారు.. తీవ్రంగా గాయపడిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.. వారు పెద్దగా పట్టించుకోకపోవడంతో బాధితుడి తల్లి జిల్లా ఎస్పీని ఆశ్రయించింది.. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Kerala: పదో తరగతి పాస్ అయినందుకు తనను తానే అభినందించుకుంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన విద్యార్థి.. ఫొటో వైరల్
ఇండోర్కు చెందిన రామకృష్ణ అనే యువకుడు ఓ ప్రైవేట్ అగ్రికల్చర్ కంపెనీలో ఫీల్డ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 13న చందన్ నగర్లోని బైక్ రిపేర్ చేయించుకుంటుండగా శుభం, సందీప్, గౌరవ్ అనే యువకులు రెండు వాహనాల్లో అక్కడకు చేరుకున్నారు. రామకృష్ణ తన కుటుంబంలోని అమ్మాయితో మాట్లాడుతున్నాడని అరుస్తూ అతడిపై దాడికి దిగారు. రామకృష్ణను కారుపై కూర్చోబెట్టుకుని తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ దారుణంగా కొట్టారు. చాలా సేపటి తర్వాత స్థానికులు కలగజేసుకుని రామకృష్ణను రక్షించి హాస్పిటల్కు తరలించారు.
నిందితులపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రాజకీయ కారణాలతో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. కేసు లేకుండా సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో రామకృష్ణ తల్లి జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి స్టేట్మెంట్ తీసుకున్నారు.