రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతి మృతి
ABN , First Publish Date - 2021-07-26T05:08:58+05:30 IST
మండలంలోని కాపుసోంపురం గ్రామం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువతుల్లో లింగంపల్లి యశ్విత(21) విశాఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు హెడ్కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు.
శృంగవరపుకోట రూరల్, జూలై 25: మండలంలోని కాపుసోంపురం గ్రామం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువతుల్లో లింగంపల్లి యశ్విత(21) విశాఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు హెడ్కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. ఈ ఘటన కు సంబంధించి ఆదివారం ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. తాడే పల్లిగూడెంకు చెందిన యువతి ఎల్.యశ్విత చైన్నై భారతీ యూనివర్శిటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. అయితే ఈమె తనతో పాటు చదువుతున్న కడప జిల్లా పొద్దుటూరు మండలం, జమ్మలమడుగుకు చెందిన నందిని రెడ్డితోపాటు తన స్నేహితులు, తన తమ్ముడి స్నేహితులతో పాటు తండ్రి లింగంపల్లి రవి కుమార్తో అరకు బయలుదేరింది. వీరు విశాఖపట్నం వరకు మొత్తం 8మంది ట్రైన్లో చేరుకున్నారు. అనంతరం మృతురాలి తండ్రి రవికుమార్ తన స్నేహితుడి కారును తీసుకొని తన పిల్లలు, వారి స్నేహితులతో అరకు వెళ్తుండగా కారు కాపు సోంపురం వద్ద అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగంలో కూర్చున్న యశ్విత, ఆమె స్నేహితురాలు నందినిరెడ్డిలు కారు పైభాగానికి బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని ఎస్. కోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్కు, అక్కడి నుంచి ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ యశ్విత మృతిచెందిందని ఆమె స్నేహితురాలు ఇంకా కోమాలో ఉందని తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.