యువకుడి అనుమానాస్పద మృతి.. సగం కాలిపోయిన దేహం
ABN , First Publish Date - 2021-06-22T13:27:16+05:30 IST
నిర్మానుష్య ప్రదేశంలో, దేహం సగం కాలిపోయిన స్థితిలో పడి ఉన్న
హైదరాబాద్ సిటీ/ఉప్పల్: నిర్మానుష్య ప్రదేశంలో, దేహం సగం కాలిపోయిన స్థితిలో పడి ఉన్న ఓ యువకుడి మృతదేహాన్ని ఉప్పల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఉప్పల్ శిల్పారామం దగ్గరలోని హెచ్ఎండీఏ భగాయత్ వెంచర్లో సుమారు 30 ఏళ్ల వయసున్న ఓ యువకుడి మృతదేహం పడి ఉందని స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు పాక్షికంగా కాలిపోయి ఉన్న మృతదేహాన్ని గమనించారు. పక్కనే పడివున్న కిరోసిన్ డబ్బాను బట్టి యువకుడు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని వారు భావిస్తున్నారు. మృతుడి ఎడమ చేతిపై యాదయ్య, బాలు అనే పేర్లు, కుడిచేతిపై భవాని అనే పేరు రాసి ఉండడంతోపాటు ఛాతీపై త్రిశూలం పచ్చబొట్లుగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. యువకుడిది హత్యా, ఆత్మహత్యా అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలుస్తుందని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.