వేధిస్తుంటే కడతేర్చారు.. భార్యాభర్తల అరెస్టు

ABN , First Publish Date - 2021-03-11T18:47:12+05:30 IST

వేధింపులు తాళలేక భర్త సహకారంతో ఓ యువకుడిని హత్యచేసిన ఘటన

వేధిస్తుంటే కడతేర్చారు.. భార్యాభర్తల అరెస్టు

హైదరాబాద్/ఆనంద్‌బాగ్‌ : వేధింపులు తాళలేక భర్త సహకారంతో ఓ యువకుడిని హత్యచేసిన ఘటన మల్కాజిగిరి పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. కార్ఖానాకు చెందిన మహ్మద్‌ ముక్రమ్‌(25) ఆటోడ్రైవర్‌. అతడికి బంధువైన సల్మాబేగం మౌలాలి షఫీనగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. అతడు తరచుగా వారింటికి వెళ్తూ ఆమెతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె భర్త మహ్మద్‌ మాజిద్‌ తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు. మహ్మద్‌ ముక్రమ్‌ అతడి మాటలు వినకుండా వేధిపులను తీవ్రం చేశాడు. ఈ క్రమంలో ముక్రమ్‌ ఈనెల 7వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో సల్మాబేగం ఇంటికి వెళ్లాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆమెను వేధించాడు. 


గదిలోకి వచ్చిన ముక్రమ్‌ను పథకం ప్రకారం తన చున్నీతో ముఖం కప్పేసి పట్టుకోగా ఆమె భర్త అతడిపై దాడి చేశాడు. ముఖంపై దిండు పెట్టి నొక్కి, చున్నీతో బిగించడంతో ఊపిరాడక మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంటి హాల్‌లో వదిలి తాళం వేసి వెళ్లిపోయారు. మృతుడి తల్లి ఖుర్షీద్‌ బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి సల్మాబేగం, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. పోలీసులు భార్యాభర్తలిద్దరినీ రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-03-11T18:47:12+05:30 IST