ప్రియురాలిని చంపి.. ఇంట్లోని సంపులో పడేసి...
ABN , First Publish Date - 2021-04-13T16:25:59+05:30 IST
ప్రియురాలిపై అనుమానంతో గొంతు నులిమి హత్య చేసి
- అనుమానమే కారణం..
- పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
హైదరాబాద్/కూకట్పల్లి : ప్రియురాలిపై అనుమానంతో గొంతు నులిమి హత్య చేసిన కేసులో నిందితుడ్ని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన సోమేశ్వరరావు మూసాపేటలో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. ఇతని కుమార్తె మంజుల (19) ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన భూపతిజైపాల్(21) బీటెక్ రెండో ఏడాది వరకు చదివి ఆపేశాడు. ప్రస్తుతం కూకట్పల్లి పాపారాయుడునగర్లో నివాసముంటూ ఖాళీగా ఉంటున్నాడు.
భూపతిజైపాల్, మంజుల వరుసకు బావమరదళ్లు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకొన్నారు. కొంతకాలంగా మంజుల మరొకరితో తరచూ మాట్లాడడం, చనువుగా ఉండడం గమనించిన భూపతి ఆమెతో గొడవ పడ్డాడు. ఇలా పలు మార్లు గొడవలు జరిగాయి. ఈ నెల 10న తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో మంజులకు ఫోన్ చేసి మాట్లాడుకొందాం... రా అంటూ ఇంటికి పిలిపించాడు. మంజులపై ఉన్న అనుమానాన్ని మరోసారి భూపతి ప్రస్తావించడంతో మంజుల ఎదిరించింది. కోపోద్రిక్తుడైన భూపతి వెంటనే మంజుల గొంతును గట్టిగా నులిమి చంపేశాడు.
ఆత్మహత్య చేసుకోబోయి...
శనివారం మధ్యాహ్నం మంజులను హత్య చేసిన తర్వాత భూపతి శవాన్ని ఇంట్లోని సంపులో పడేశాడు. భయంతో తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఫ్యానుకు ఉరేసుకోవాలని ప్రయత్నించి విరమించుకొన్నాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగాడు. అదేరోజు రాత్రి పోలీ్సస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మంజుల తల్లిదండ్రులు ఆదివారం రాత్రి శ్రీకాకుళం నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.