రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
ABN , First Publish Date - 2021-04-22T06:51:06+05:30 IST
శ్రీకాకుళం నుంచి విజయవాడకు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఇద్దరు యువకులు బుధవారం హనుమాన్జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు.
పెళ్లిచూపులకు వెళ్లి వస్తుండగా దుర్ఘటన
హనుమాన్జంక్షన్, ఏప్రిల్ 21 : శ్రీకాకుళం నుంచి విజయవాడకు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఇద్దరు యువకులు బుధవారం హనుమాన్జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వాసుదేవ పట్నానికి చెందిన ఊరడ సత్యనారాయణ (24) విజయవాడలో పెయింట్ పని చేస్తున్నాడు. తన పెళ్లి చూపులు విషయమై స్నేహితుడైన విజయవాడ సమీపంలోని గుణదలకు చెందిన కేతల యశోధకృష్ణ (28)తో కలిసి ఈనెల 19న విజయవాడ నుంచి శ్రీకాకళం జిల్లా తన సొంతూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. మంగళవారం పెళ్లి చూపులు అవ్వగానే ఇద్దరు తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం ఉదయం 6గంటల ప్రాంతంలో హనుమాన్జంక్షన్ వద్ద లయన్స్ క్లబ్ సమీపంలో ప్రమాదవశాత్తు రహదారి డివైడర్ను ఢీకొన్నారు. ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇరువురు పెయింటింగ్ కార్మికులే రాత్రంతా ప్రయాణం చేసి ఉండడంతో నిద్ర మత్తులో డివైడరును ఢీకొట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హనుమాన్ జంక్షన్ ఎస్సై ఎన్.చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు నూజివీడు ప్రభుత్వా సుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.