చంద్రబాబు కుప్పం వస్తే బాంబు వేస్తా.. వైసీపీ నేత తీవ్ర పదజాలం!

ABN , First Publish Date - 2021-10-22T19:16:59+05:30 IST

టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు...

చంద్రబాబు కుప్పం వస్తే బాంబు వేస్తా.. వైసీపీ నేత తీవ్ర పదజాలం!

చిత్తూరు : టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఒకరు ఒక మాటంటే.. తామేం వాళ్లకు తక్కువేం కాదని రెచ్చిపోయి మరీ ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టగా దీనికి పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్ష చేపట్టింది. దీక్షాస్థలి నుంచి కూడా అటు టీడీపీ నేతలు.. ఇటు వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దీంతో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియక ఆయా పార్టీల కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.


దమ్ముంటే కుప్పం రా..!

తాజాగా.. చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై ఓ నేత రెచ్చిపోయి తీవ్ర పదజాలం వాడారు. ‘చంద్రబాబూ.. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా... ’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది బాధ్యతాయుత పదవిలో ఉన్న రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్‌. ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెంథిల్ మాట్లాడుతున్నంత సేపు రెడ్డెప్ప సహా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన్ను ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అంతేకాదు ఇంకా చాలా బూతులే సెంథిల్ మాట్లాడారు. ఇన్నేసి మాటలు మాట్లాడినప్పటికీ స్టేజ్‌పై ఉన్న నేతలంతా ఆయన్ను ఎంకరేజ్ చేశారో కానీ ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కాగా.. ప్రతిపక్ష పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారు.. బెదిరిస్తున్నారన్న వైసీపీ నేతలు.. వీళ్లేం చేస్తున్నారో ఒకసారి చూడండంటూ ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2021-10-22T19:16:59+05:30 IST