తారక తంత్రం.. TDPని దెబ్బకొట్టేందుకు YCP కుతంత్రం!

ABN , First Publish Date - 2021-11-29T18:45:06+05:30 IST

టీడీపీపై వైసీపీ కొత్త మైండ్‌గేమ్‌కు తెరలేపిందా? కొత్త డ్రామా మొదలుపెట్టిందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇవే అనుమానాలొస్తున్నాయి.

తారక తంత్రం.. TDPని దెబ్బకొట్టేందుకు YCP కుతంత్రం!

ఏబీఎన్ డెస్క్: టీడీపీపై వైసీపీ కొత్త మైండ్‌గేమ్‌కు తెరలేపిందా? కొత్త డ్రామా మొదలుపెట్టిందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇవే అనుమానాలొస్తున్నాయి. ఇటీవలి కాలంలో టీడీపీ కార్యక్రమాలు జరిగే చోట జూనియర్‌ ఎన్టీఆర్‌ నినాదాలు వినిపించడం వైసీపీ మైండ్‌గేమ్‌లో భాగమేనని అంటున్నారు. చంద్రబాబు సభల్లోకాని, లోకేశ్‌ సభల్లోకాని, లేక టీడీపీకి చెందిన ఇతర కార్యక్రమాల్లో ఇటీవలి కాలంలో జూనియర్‌ ఎన్టీఆర్‌  అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి.  అయితే ఇదంతా కావాలని చేయిస్తున్నదేనని, వైసీపీనే ఇదంతా చేయిస్తోందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఏపీలో వైసీపీ అరాచకాలను టీడీపీ దీటుగా ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో మరింతగా దూకుడు పెంచింది. అటు వయసును సైతం లెక్క చేయని చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారు. లోకేష్‌ కూడా ఇంతకుముందుకంటే బలంగా ప్రజల్లోకి వెళ్ళి వైసీపీ తీరును ఎండగడుతున్నారు. వైసీపీకి ఎదురుగాలి మొదలైందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ తరుణంలో కొన్ని టీడీపీ కార్యక్రమాల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ మైండ్‌గేమ్‌లో భాగంగానే ఇదంతా జరుగుతోందని టీడీపీ వాదిస్తోంది. ఒక్క టీడీపీ మీటింగ్‌లే కాదు నందమూరి కుటుంబ హీరోల సినిమా ఫంక్షన్లలోనూ సేమ్ సీన్. ఇందుకు కారణం నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు లోకేష్‌కు తన కుమార్తెను ఇచ్చారు.. ఇప్పటికీ టీడీపీకి అండగానే ఉన్నారు.


అప్పట్లో టీడీపీ తరఫున క్యాంపెయిన్ చేసి ఆకట్టుకున్న తారక్..కొన్నేళ్లుగా సైడయ్యారు. తెలుగుదేశం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మాట్లాడితే తాతగారు..తాతగారు..అని చెప్పే జూనియర్.. తాతగారు స్థాపించిన పార్టీని పక్కన పేట్టేశారు. టీడీపీ అంటే తెలియనట్టే వ్యవహరిస్తూ వస్తున్నారు. మరోవైపు నందమూరి-నార కుటుంబాల్లో కూడా తారక్ కలవడం లేదు. అందరికి దూరంగా ఉంటున్నారు. మొన్న నారా భువనేశ్వరి ఎపిసోడ్‌పై స్పందించినా ఎక్కడా నేరుగా తమ కుటుంబాల పేర్లను ప్రస్తావించలేదు. మద్దతు ప్రకటించలేదు. వైసీపీ తీరును ఖండిస్తున్నట్టుగాని, నాని, వంశీ వ్యాఖ్యలు తప్పనిగానీ నేరుగా చెప్పలేదు. మొత్తంగా ఇటీవలి కాలంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నినాదాల వెనుక వైసీపీ కుతంత్రం ఉందని స్పష్టంగా తెలుస్తోందని టీడీపీ అంటోంది.. ఎవరున్నా... లేకపోయినా.. ఎవరు వచ్చినా.. రాకపోయినా... టీడీపీకి కార్యకర్తలే కొండంత బలమని పార్టీ అధినాయకత్వం అంటోంది.. తమకు ఎవరి దయాదాక్షిణ్యాలు కూడా అక్కర్లేదంటోంది. 

Updated Date - 2021-11-29T18:45:06+05:30 IST