వడ్లు కొనకుంటే ఆమరణ దీక్షకు దిగుతా

ABN , First Publish Date - 2021-12-21T07:02:52+05:30 IST

రాష్ట్రంలోని రైతుల వడ్లను కేసీఆర్‌ ప్రభుత్వం కొనకుంటే.. తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు.

వడ్లు కొనకుంటే ఆమరణ దీక్షకు దిగుతా

  • చివరి వరకూ రైతుల పక్షాన కొట్లాడతా
  • రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతా: షర్మిల

కామారెడ్డి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతుల వడ్లను కేసీఆర్‌ ప్రభుత్వం కొనకుంటే.. తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల ధాన్యాన్ని ప్రతీ సీజన్‌లో కొనాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతానని, తన ప్రాణం పోయేంత వరకూ రైతుల పక్షాన కొట్లాడుతానని చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో కామారెడ్డి జిల్లాలో ఇటీవల కుప్పల వద్దే మృతి చెందిన, ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను సోమవారం షర్మిల పరామర్శించారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో రాజయ్య, లింగంపేట మండలంలోని ఐలాపూర్‌లో బీరయ్య, నాగిరెడ్డిపేట మండలం వడల్‌పర్తిలో మున్నూరు యాదగిరి, కండే మల్ల్లేశ్‌ కుటుంబాలను పరామర్శించి, రూ.25వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. వరి సాగు చేయొద్దని రైతులకు చెప్పడానికి కేసీఆర్‌కు ఏ అధికారం, హక్కు ఉందని ప్రశ్నించారు.


వరి సాగు, ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్‌ పూటకో మాట మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని, దీంతో మనోవేదనకు గురై రెండు నెలల కాలంలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ కేసీఆర్‌ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. మృతి చెందిన, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతుల పంటల సాగు విషయంలో.. ధాన్యం కొనుగోళ్లలో కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారని, పైగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ చావు డప్పు కొట్టాలంటూ పిలుపునివ్వడం సిగ్గుచేటని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌కు పాలన చేత కాకనే ధర్నాలు చేస్తున్నానని విమర్శించారు. చివరి గింజ వరకూ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని, లేకుంటే త్వరలో రైతులే కేసీఆర్‌కు చావు డప్పు కొడతారని విమర్శించారు. 

Updated Date - 2021-12-21T07:02:52+05:30 IST