త్రివర్ణ పతాకాలతో ప్రదర్శన
ABN , First Publish Date - 2022-08-14T03:15:30+05:30 IST
మండలంలోని గంగవరంలో గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు శనివారం జాతీయ పతాకాలతో ప్రదర్శన చేపట్టారు. ప్రద
కోవూరు, ఆగస్టు13 : మండలంలోని గంగవరంలో గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు శనివారం జాతీయ పతాకాలతో ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శనలో భరతమాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. త్రివర్ణపతాకాల రెపరెపలతో గంగవరం కలకలలాడింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు, ప్రిన్సిపాల్ సందీప్కుమార్, అధ్యాపకులు టీఎన్వీఎల్ఎన్ కుమార్, దినకర్, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇందుకూరుపేటలో..
ఇందుకూరుపేట : మండలంలో శనివారం కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు వేడుగ్గా జరిగాయి. పలు పాఠశాలలు, విద్యార్థులు మువ్వన్నెల జెండాలతో ర్యాలీలు, ప్రదర్శనలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. రాముడుపాలెం ఉన్నత పాఠశాలల విద్యార్థులు సముద్ర తీరం వరకు ర్యాలీగా వెళ్లారు. సముద్రంలోకి మువ్వన్నెల రంగు కలిగిన బెలూన్లను వదిలారు. ఒడ్డున ఇసుక కూడిన జెండాను చిత్రీకరించి రంగులు అద్ది సెల్యూట్ చేశారు. స్వాతంత్య్ర ఉద్యమాలు, మహాత్ముల కృషిని ఉపాధ్యాయురాలు గ్లోరీ వివరించారు. పల్లెపాడు, సోమరాజుపల్లి, గంగపట్నం, కొత్తూరు, జగదేవిపేట గ్రామాల్లోని పాఠశాలల వారు కూడా ఉత్సవాలు నిర్వహించారు.
బుచ్చిరెడ్డిపాళెంలో..
బుచ్చిరెడ్డిపాళెం : బుచ్చితోపాటు మండలంలోని జొన్నవాడ, తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో శనివారం ర్యాలీ నిర్వహించారు. బుచ్చిలో మూడు వందలకుపైగా విద్యార్థులు జెండాల పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాలబాలికలు దేశనాయకులు, భారతమాత వేష ధారణలో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, కౌన్సిలర్లు ప్రమీలమ్మ, శ్రీచైతన్య స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.