నాణ్యత విషయంలో అఽధికారులు రాజీపడొద్దు
ABN , First Publish Date - 2020-12-04T04:44:08+05:30 IST
నాణ్యత విషయంలో అఽధికారులు రాజీపడొద్దు
జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్రెడ్డి
వికారాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : జడ్పీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడితే ఊరుకునేది లేదు.. నాణ్యతగా ఉండేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారులదే.. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా రాజీపడొద్దు.. అని జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో జడ్పీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆమె గురువారం ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా పరిషత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని చోట్ల అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడిందని, డస్ట్ ఎక్కువగా వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్పల్లి మెయిన్ రోడ్డే ఇందుకు ఉదాహరణ అని ఆమె గుర్తు చేశారు. పనులు పారదర్శకంగా, నాణ్యతగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడొద్దని ఆమె అధికారులను ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఇక నుంచి తప్పనిసరిగా తనిఖీలు చేసి రిపోర్ట్ సమర్పించాలని, లేకపోతే బిల్లులు నిలిపివేయాలని ఆమె స్పష్టం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ ద్వారా మంజూరైన రూ.30 కోట్ల పనులకు సంబంధించి ఇంకా ప్రారంభించని పనుల జాబితా వెంటనే అందజేయాలన్నారు. మంజూరు చేసిన అంగన్వాడీ, డ్వాక్రా భవనాల నిర్మాణం పనుల్లో ఇంకా పనులు ప్రారంభించని భవనాల వివరాలు తెలపాలని ఆదేశించారు. మహబూబ్నగర్ జడ్పీ నుంచి జిల్లాకు బదలాయించిన రూ.3.90 కోట్లను కొడంగల్, దౌల్తాబాద్, బొంరా్సపేట మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ఉష, డీఆర్డీవో కృష్ణన్, పీఆర్ఈఈ శ్రీనివా్సరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, ఆర్అండ్ఈ ఈఈ లాల్సింగ్, పీఆర్, ఆర్అండ్బీ, మిషన్ భగీరధ డిప్యూటీ ఈఈలు పాల్గొన్నారు.
కోరం లేక జడ్పీ సమావేశం వాయిదా
కోరం లేక వికారాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. గురువారం జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన జడ్పీ సమావేశానికి పెద్దేముల్ జడ్పీటీసీ ధారాసింగ్, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ మాత్రమే హాజరయ్యారు. సమావేశం నిర్వహించేందుకు అవసరమైన కోరం లేని కారణంగా చైర్పర్సన్ సునీతారెడ్డి ఒక గంట పాటు వాయిదా వేశారు. అయితే అప్పటి వరకు కూడా సమావేశం నిర్వహించేందుకు అవసరమైన కోరం మేరకు సభ్యులెవరూ హాజరు కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు చైర్పర్సన్ సునీతారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో బి.ఉష, డీఆర్డీవో కృష్ణన్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.