‘నాడు-నేడు’ పేరుతో జడ్పీ పాఠశాల ఆవరణలో ఇసుక డంప్
ABN , First Publish Date - 2022-08-16T04:25:56+05:30 IST
విద్యార్థుల చదువుకు భంగం కలిగిస్తూ కావలి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో నాడు- నేడు పనుల పేరుతో ఆదివారం రాత్రి ఇసుక డంప్ చేశారు.
స్థానికుల అభ్యంతరం
కావలి, ఆగస్టు 15: విద్యార్థుల చదువుకు భంగం కలిగిస్తూ కావలి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో నాడు- నేడు పనుల పేరుతో ఆదివారం రాత్రి ఇసుక డంప్ చేశారు. దీనికి స్థానికులు అభ్యంతరం చెప్పినా వినిపించుకునేవారే కరువయ్యారు. ఇక్కడ ఇసుక డంప్ చేసేందుకు ముందుగా ఆపాఠశాల ప్రధానోపాధ్యాయిని ఏబీ నీరజ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాఠశాలకు సంబంధించిన ఆటస్థలంలో కొన్ని టిప్పర్ల ఇసుక తోలారు. దీంతో స్థానికలు, ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. దీంతో రెచ్చిపోయిన ఇసుకాసురులు పాఠశాల ఆవరణలో భవనాల ముందు సుమారు 400 టన్నుల ఇసుకను డంప్ చేశారు. ఇసుక ట్రిప్పర్లు పాఠశాల ప్రధాన గేటు ద్వారా రాత్రి సమయంలో రాకపోకలు సాగించడంతో టిప్పర్లు తగిలి పాఠశాల ప్రహరీ దిమ్మె ధ్వంసమైంది. పాఠశాల నేమ్ బోర్డు ఇనుప ఆర్చి ఊడి కిందపడింది. నాడు- నేడు పాఠశాలలకు ఇసుక డంప్ చేసుకునేందుకు అనేక ఖాళీ ప్రదేశాలు ఉండగా పాఠశాల ఆవరణలోనే డంప్ చేయటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నాడు- నేడు పనుల కోసమే..
కావలి పట్టణ, పరిసరప్రాంతాల్లో నాడు-నేడు కింద రెండో విడత నిర్మాణం చేపడుతున్న పాఠశాలల కోసం ఇసుకను డంప్ చేశారు. తొలుత తాము అభ్యంతరం చెప్పగా పాఠశాల క్రీడామైదానంలో తోలేందుకు సిద్ధమయ్యారు. అక్కడ మైదానం దెబ్బతింటుండటంతో మళ్లీ పాఠశాల ఆవరణలోనే తోలారు. నిర్మాణాలు ప్రారంభం కాగానే ఆ ఇసుకను ఇక్కడ నుంచి తరలిస్తారు.
- ఏబీ నీరజ, ప్రధానోపాధ్యాయిని