అట్టహాసంగా ఆరణి నామినేషన్
ABN , Publish Date - Apr 24 , 2024 | 01:57 AM
జిల్లావ్యాప్తంగా ఐదవ రోజైన మంగళవారం మొత్తం 31 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
-ఐదవ రోజు 31మంది నామినేషన్లు
-పార్లమెంటుకు 5... అసెంబ్లీ స్థానాలకు 26
తిరుపతి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఐదవ రోజైన మంగళవారం మొత్తం 31 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఐదుగురు, గూడూరు అసెంబ్లీకి ఐదుగురు, సూళ్ళూరుపేటకు ఇద్దరు, సత్యవేడుకు ఇద్దరు, శ్రీకాళహస్తికి ముగ్గురు, తిరుపతికి ఎనిమిదిమంది, చంద్రగిరికి ఆరుగురు చొప్పున ఆరు అసెంబ్లీ స్థానాలకు గానూ 26 మంది చొప్పున వున్నారు. వెంకటగిరి స్థానానికి మంగళవారం నామినేషన్లు ఏమీ దాఖలు కాలేదు.తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వేలాదిమంది కార్యకర్తలతో ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి టీడీపీ,జనసేన, బీజేపీ నాయకులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల అరాచకాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. కాబట్టే నామినేషన్ కార్యక్రమానికి వేలాదిమంది తరలివచ్చారన్నారు. చంద్రగిరి నుంచీ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీ నామినేషన్ పత్రాలు సమర్పించారు. గూడూరు నుంచీ వైసీపీ తరపున మేరిగ మురళీధర్ రెండు సెట్లు నామినేషన్లు వేశారు. సూళ్ళూరుపేట నుంచీ కాంగ్రెస్ తరపున కన్నంబాకం హరికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. సత్యవేడు నుంచీ వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేశ్, శ్రీకాళహస్తి నుంచీ కాంగ్రెస్ తరపున పోతుగుంట రాజేష్ నాయుడులు నామినేషన్లు వేశారు.తిరుపతి పార్లమెంటుకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున రిటైర్డు ఐఏఎస్ అధికారి జి.విజయ్కుమార్, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్ తరపున బి.భరణి, ఇండియన్ బిలీవర్స్ పార్టీ నుంచీ సి.డేవిడ్, జై హిందూస్థాన్ పార్టీ తరపున అక్కిలిగుంట మధు, ఇండిపెండెంట్గా కట్టమంచి ప్రభాకర్ నామినేషన్లు వేశారు. గూడూరు అసెంబ్లీకి ఇండియన్ బిలీవర్స్ పార్టీ నుంచీ కర్ల రమేష్ బాబు, బీఎస్పీ అభ్యర్థి అన్నెం మల్లికార్జున, జై భారత్ నేషనల్ పార్టీ తరపున గొర్రిపాటి వెంకటేశ్వర్లు, ఇండిపెండెంట్గా తాటిపర్తి బాబు నామినేషన్లు దాఖలు చేశారు. సూళ్ళూరుపేట అసెంబ్లీకి ఇండిపెండెంట్గా నెలవల జగదీష్, సత్యవేడు అసెంబ్లీకి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచీ జి.విజయ్కుమార్ నామినేషన్లు వేశారు.శ్రీకాళహస్తి అసెంబ్లీకి ఇండిపెండెంట్గా మన్నసముద్రం నాగరాజు, వైసీపీ డమ్మీ అభ్యర్థిగా బి.శ్రీ పవిత్ర నామినేషన్లు దాఖలు చేశారు. చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి నవ భారత నిర్మాణ సేవా పార్టీ తరపున పత్తిపుత్తూరు విశ్వనాఽథ రెడ్డి, జై హిందూస్థాన్ పార్టీ తరపున ఎం.నీలకంఠ, జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ తరపున ఎల్.ప్రసాద్, భారత చైతన్య యువజన పార్టీ తరపున అక్కిపల్లి కృష్ణవేణి యాదవ్, ఇండిపెండెంట్లుగా శ్రీచరణ్, మాదాసి ప్రభాకర్, సంజయ్ కుమార్ నామినేషన్లు వేశారు. తిరుపతి అసెంబ్లీకి జనసేన డమ్మీ అభ్యర్థిగా ఎ.సత్యవతి, ఇండిపెండెంట్లుగా షేక్ మహ్మద్ గౌస్, ఆర్.జ్యోతి, బుడ్డోళ్ళ విశ్వనాధ్, రంగూన్ శంకర్, ఊటుకూరు సుబ్రమణ్యం నామినేషన్లు దాఖలు చేశారు.