Share News

IPL 2024: ‘కోహ్లీ, ధోనీనే కాదు.. ఆ ఆటగాడు కూడా ఓ లెజెండ్’

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:49 PM

మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సాధించిన అద్భుతమైన విజయంలో జోస్ బట్లర్ పాత్ర అత్యంత ప్రధానమైందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. 224 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆ జట్టు 14 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసినప్పుడు, బట్లర్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

IPL 2024: ‘కోహ్లీ, ధోనీనే కాదు.. ఆ ఆటగాడు కూడా ఓ లెజెండ్’

మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై (Kolkata Knight Riders) రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సాధించిన అద్భుతమైన విజయంలో జోస్ బట్లర్ (Jos Buttler) పాత్ర అత్యంత ప్రధానమైందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. 224 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆ జట్టు 14 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసినప్పుడు, బట్లర్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అతడు ప్రదర్శించిన గొప్ప ఆట కారణంగానే.. రాజస్థాన్ జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే బట్లర్‌పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ (Harbharaj Singh) అతనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, ధోనీల తరహాలోనే అతడూ ఓ లెజెండ్ అని కొనియాడాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్.. కారణం ఇదే?


‘‘జోస్ బట్లర్ ఒక ప్రత్యేకమైన ఆటగాడు. బట్లర్ ఇలాంటి ప్రదర్శన కనబరచడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా అతడు ఇలాగే అద్భుతంగా రాణిస్తున్నాడు. మున్ముందు కూడా మంచి ప్రదర్శనలతో చెలరేగుతాడు. అసాధారణమైన ప్రతిభ అతని సొంతం. అయితే.. బట్లర్ మన భారతీయ ఆటగాడు కాదు కాబట్టి, అతని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు. ఒకవేళ ఇదే సెంచరీ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) చేసి ఉంటే.. కనీసం రెండు నెలల పాటు అతడిని ప్రశంసిస్తూ మాట్లాడుకునేవాళ్లం. అంతెందుకు.. ఎంఎస్ ధోని కొట్టిన మూడు, నాలుగు సిక్సర్ల గురించి కూడా మనం పెద్ద ఎత్తున చర్చలు జరుపుతాం. మన ప్లేయర్ల ఇన్నింగ్స్ గురించి సెలబ్రేట్ చేసినట్లే.. బట్లర్‌ గురించి కూడా సంబరాలు జరుపుకోవాలి. ఎందుకంటే.. అతనొక లెజెండ్’’ హర్భజన్‌ సింగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

దయచేసి ఆర్సీబీని అమ్మిపారేయండి.. టెన్నిస్ దిగ్గజం తీవ్ర అసహనం

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (Sunil Narine) మెరుపు సెంచరీ (56 బంతుల్లో 109) పుణ్యమా అని, కేకేఆర్ అంత భారీ స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి గెలుపొందింది. బట్లర్ చివరివరకూ క్రీజులో నిలబడి శతక్కొట్టడం వల్లే రాజస్థాన్ విజయం సాధించింది. కాగా.. ఐపీఎల్‌లో బట్లర్‌కు ఇది ఏడో సెంచరీ. విరాట్‌ కోహ్లీ(8) తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా బట్లర్‌ కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి బట్లర్ 250 పరుగులు నమోదు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 17 , 2024 | 02:59 PM