కరోనాతో ఆర్టీసీకి నెలకు రూ. 16కోట్లు నష్టం
ABN , First Publish Date - 2021-07-25T06:06:30+05:30 IST
చిత్తూరు డివిజన్లో కరోనా కారణంగా ఆర్టీసీకి నెలకు రూ. 16కోట్లు నష్టం వాటిల్లుతోందని ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం భాస్కర్రెడ్డి అన్నారు.
డిప్యూటి సీటీఎం భాస్కర్రెడ్డి
పీలేరు, జూలై 24: చిత్తూరు డివిజన్లో కరోనా కారణంగా ఆర్టీసీకి నెలకు రూ. 16కోట్లు నష్టం వాటిల్లుతోందని ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం భాస్కర్రెడ్డి అన్నారు. పీలేరు ఆర్టీసీ డిపో కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు డివిజన్లోని డిపోలలో మొత్తం 618 ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉండగా ప్రస్తుతం 390 మాత్రమే నడుపుతున్నట్లు తెలిపారు. రోజుకు 2.57లక్షల కిలోమీటర్లు బస్సు సర్వీసులను నడపాల్సి ఉండగా 1.57లక్షల కిలోమీటర్లు మాత్రమే నిర్వహిస్తున్నట్లు వివరించారు. కరోనాకు ముందు డివిజన్లో ఆర్టీసీకి రూ. కోటి ఆదాయం లభించేదని, ప్రస్తుతం రూ. 38లక్షలు మాత్రమే వస్తోందన్నారు. డివిజన్లో మొత్తం 433 షాపింగ్ గదులు ఉన్నాయని, వీటిలో ఖాళీగా ఉన్న 212 గదులకు టెండర్లు పిలవగా 72 వాటికి మాత్రమే స్పందన వచ్చిందన్నారు. కార్గో సేవల ద్వారా ఆర్టీసీకి ఆశించిన ఆదాయం చేకూరుతోందన్నారు. ఈ సమావేశంలో పీలేరు డిపో మేనేజర్ వీరాస్వామి, సీఐ ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.