మెదక్‌ మున్సిపాలిటీకి రూ.20కోట్లు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-10-01T04:39:12+05:30 IST

మెదక్‌లో శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ అధ్యక్షతన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

మెదక్‌ మున్సిపాలిటీకి రూ.20కోట్లు: ఎమ్మెల్యే
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్‌ మున్సిపాలిటీ, సెప్టెంబరు 30: మెదక్‌లో శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ అధ్యక్షతన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరై కౌన్సిలర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే మంత్రి కేటీఆర్‌ పర్యటన జిల్లా కేంద్రంలో ఉంటుందని, ఆ సమయంలోనే మున్సిపల్‌ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరవుతాయని ప్రకటించారు. అనంతరం కౌన్సిలర్లు తమ వార్డుల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే... ట్యాంక్‌బండ్‌ నిర్మాణానికి రూ.3 కోట్లు అదనంగా మంజూరయినట్లు తెలిపారు. పార్కు నిర్మాణానికి రెండెకరాల స్థలాన్ని ఇవ్వాలని పంచముఖి పంతులును కోరినట్లు వెల్లడించారు. నూతన మాస్టర్‌ప్లాన్‌ ఆమోదించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఇండస్ట్రియల్‌ జోన్‌ ఏర్పాటు విషయంలో ఇప్పటికే భూమిని గుర్తించినట్లు వెల్లడించారు. రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించారు. చమన్‌-దాయర రోడ్డు విస్తరణ టీయూఎ్‌ఫఐడీసీ నిధులు రాగానే చేపడతామన్నారు. మున్సిపల్‌ స్థలాలు కబ్జాకు గురికాకుండా చూడాలని సూచించారు. నూతన కలెక్టరేట్‌ భవనం డిసెంబరులో ప్రారంభించే అవకాశాలున్నట్లు చెప్పారు. దసరా తరువాత మిషన్‌భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని, అదే రోజు కౌన్సిలర్లు తమ సమస్యలు తెలియజేయాలన్నారు. సమావేశంలో కమిషనర్‌ శ్రీహరి, డీఈ మహేష్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-10-01T04:39:12+05:30 IST