నూతన పంచాయతీ రాజ్‌కు 27 ఏళ్లు

ABN , First Publish Date - 2021-04-24T05:06:52+05:30 IST

ఇరవై ఏడేళ్ల క్రితం పంచాయతీ రాజ్‌ వ్యవస్థ కొత్త రూపుదాల్చింది. 1994 ఏప్రిల్‌ 24న చేసిన రెండు రాజ్యాంగ సవరణల ద్వారా ఈ వ్యవస్థకు నూతన జవసత్వాలు కల్పించాలన్న ఉద్ధేశంతో ఆ దిశగా ప్రయత్నాలకు పురుడుపోశారు.

నూతన పంచాయతీ రాజ్‌కు 27 ఏళ్లు

1994లో రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త వ్యవస్థ


కలికిరి, ఏప్రిల్‌ 23: ఇరవై ఏడేళ్ల క్రితం పంచాయతీ రాజ్‌ వ్యవస్థ కొత్త రూపుదాల్చింది. 1994 ఏప్రిల్‌ 24న చేసిన రెండు రాజ్యాంగ సవరణల ద్వారా ఈ వ్యవస్థకు నూతన జవసత్వాలు కల్పించాలన్న ఉద్ధేశంతో ఆ దిశగా ప్రయత్నాలకు పురుడుపోశారు. స్థానిక సంస్థలకు 29 అంశాల్లో స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న సుదీర్ఘ కాలం నుంచి కొనసాగిన ఒత్తిళ్లకు ఈ సవరణలు అవకాశం కల్పించాయి. అప్పటి వరకూ ఉన్న మండల, జిల్లా పరిషత్తులు ప్రజా పరిషత్తులుగా మారాయి. మూడంచెల వ్యవస్థ రూపు  మారిపోయింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులనే మూడంచెలకు బదులుగా ఎక్కడికక్కడ గొలుసు తెగ్గొట్టి కొత్త వ్యవస్థ రూపుదిద్దుకొంది. వార్డు మెంబర్లు, సర్పంచులు ఒక వ్యవస్థకాగా, ఎంపీటీసీలు, మండల పరిషత్తులు మరో వ్యవస్థగా, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు ఇంకో వ్యవస్థగా మారాయి. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పరోక్ష పద్ధతిలో మండల పరిషత్తు అధ్యక్షుడిని, జడ్పీ అధ్యక్షుడిని ఎన్నుకొనే విధానం అమల్లోకొచ్చింది. పార్టీలకు అతీతంగా సర్పంచు, పార్టీ పరంగా పరిషత్తు ఎన్నికల విధానంలో మాత్రం మార్పు రాలేదు. అనంతర కాలంలో పరిషత్తులకు బదులుగా ప్రజా పరిషత్తులుగా నామకరణం చేశారు. 

ఆశలు గల్లంతు..

తాజాగా గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా 29 అంశాల్లో కనీసం పది అంశాలైనా స్థానిక సంస్థలకు దఖలు పడతాయని ఆశపడ్డ వారికి ఇటీవలి ప్రభుత్వ నిర్ణయం అశనిపాతమయ్యింది. సచివాలయాల పర్యవేక్షణను సర్పంచు నుంచి దూరం చేసి రెవెన్యూ పరం చేయడంతో గతంలో జరిగిన రాజ్యాంగ సవరణలకు గొడ్డలి పెట్టుగా పరిణమించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయాలతో మరో వైపు గ్రామ పంచాయతీలు కూడా మండల పరిషత్తు నుంచి విడిపోయే పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. ఎటు తిరిగీ గ్రామ పరిపాలన మొత్తం ఇప్పుడు బూర్జువా పాలనపరమై పోయిందని వాపోతున్నారు. రాజ్యాంగ సవరణలతో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినా అవి క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చడానికి ఉన్న దార్లన్నీ గత నెల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 2 ద్వారా శాశ్వతంగా మూసుకుపోయాయని అంటున్నారు. 

Updated Date - 2021-04-24T05:06:52+05:30 IST