తీన్మార్ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-05-10T04:58:03+05:30 IST
తీన్మార్ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు
ఘట్కేసర్ రూరల్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై అసత్య కథనాలు ప్రసారం చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు ఆదివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఘట్కేసర్ రెవెన్యూ పరిధిలోని మైసమ్మగుట్టకు సంబంధించిన భూములను మంత్రి మల్లారెడ్డి ఆక్రమించాడని క్యూ న్యూస్లో తీన్మార్ మల్లన్న ప్రసారం చేసినట్లు తెలిపారు. మైసమ్మగుట్టకు సంబంధించి మొత్తం 203 ఎకరాల్లో ఉన్నవి పట్టా భూములని, వాటిని ఆనుకొని సర్వేనెంబర్ 543/2లోని 18 ఎకరాల భూమి మాత్రమే ప్రభుత్వ భూమి అని, ప్రస్తుతం ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందన్నారు. పట్టా భూములకూ మంత్రి మల్లారెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని వారు తెలిపారు. తీన్మార్ మల్లన్న కావాలనే మంత్రిపై ఆసత్య ప్రసారాలు చేస్తూ, ఆయన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొ న్నారు. ఫిర్యాదుచేసిన వారిలో ఘట్కేసర్ మునిసిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని, వైస్చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు బండారి ఆంజనేయులు, బేతాల నర్సింగ్రావు, కడుపోల్ల మల్లేశ్, టీఆర్ఎస్ ఘట్కేసర్ మునిసిపాలిటీ శాఖ అఽధ్యక్షుడు బండారి శ్రీనివాస్గౌడ్, ముల్లి జంగయ్య యాదవ్, అబ్బసాని పొన్నయ్య యాదవ్ తదితరులున్నారు.