రాజ్యసభకు అర్హులైన బీసీలు రాష్ట్రంలో లేరా?

ABN , First Publish Date - 2022-05-20T06:35:23+05:30 IST

రాజ్యసభకు వెళ్లేందుకు రాష్ట్రంలో అర్హత కలిగిన బీసీలు లేరా అని టీడీపీ చిత్తూరు పార్లమెంటు బీసీసెల్‌ అధ్యక్షుడు షణ్ముగ రెడ్డి ప్రశ్నించారు.

రాజ్యసభకు అర్హులైన బీసీలు రాష్ట్రంలో లేరా?
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ బీసీసెల్‌ నేతలు

ఇక్కడి వారికి అధికారం, నిధుల్లేని కార్పొరేషన్లా 

టీడీపీ బీసీ సెల్‌ నేతల విమర్శ 

చిత్తూరు సిటీ, మే 19: రాజ్యసభకు వెళ్లేందుకు రాష్ట్రంలో అర్హత కలిగిన బీసీలు లేరా అని టీడీపీ చిత్తూరు పార్లమెంటు బీసీసెల్‌ అధ్యక్షుడు షణ్ముగ రెడ్డి ప్రశ్నించారు. చిత్తూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బీసీలకు విలువ ఇవ్వడంలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో బీసీ బ్రాండ్‌ను అడ్డం పెట్టుకుని ఏపీ ప్రజలను గో బ్యాక్‌ అన్న ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభ సభ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్రంలోని సుమారు 2.30 కోట్ల బీసీల్లో రాజసభకు అర్హతకలిగిన వారే లేరా అన్నారు. బీసీలను కేవలం ఓటుబ్యాంకుగా వైసీపీ చూస్తోందని ఆరోపించారు. అధికారం, నిధులున్న కార్పొరేషన్లను ముఖ్యమంత్రి సామాజిక వర్గాలకు ఇచ్చుకుని.. ఉత్తుత్తివి బీసీలకు కేటాయించారన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య సాగునీరు, విద్యుత్‌ తదితర సమస్యలెన్నో ఉన్నాయని టీడీపీ చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు చెందిన క్రిష్ణయ్య మన రాష్ట్ర సమస్యలపై ఎలా పోరాడతారని అనుమానం వ్యక్తంచేశారు. దీనిపై వైసీపీకి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆలోచించాలని కోరారు. ఈ సమావేశంలో నేతలు ధనుంజయ యాదవ్‌, వినాయక గౌండర్‌, సప్తగిరి ప్రసాద్‌, నాగభూషణం, సుబ్రమణ్యం, పూర్ణచంద్ర, మునిరత్నంరెడ్డి, ఈశ్వర్‌, మోహన్‌రాజ్‌, శరవణ, గోపి, సుబ్రి, మురుగ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T06:35:23+05:30 IST