మెరుగ్గా మున్సిపల్ ఎన్నికలు
ABN , First Publish Date - 2021-03-03T07:25:56+05:30 IST
గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే మెరుగ్గా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు.
కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం, మార్చి2 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే మెరుగ్గా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, ఎన్నికల అధికారులు, ఆర్వోలు, జోన ల్ అధికారుతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయన్నారు. ఆ స్ఫూర్తితోనే మున్సిపల్ ఎన్నికలలు మ రింత మెరుగ్గా నిర్వహించాలని ఆదేశించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో సహజంగా ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందనీ, ఆ మేరకు ఓటర్లకు అవగాహన కల్పించి, ఓటు వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అత్యధిక ఓటింగ్ శాతం నమోదు చేసిన మున్సిపాలిటీలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీని బుధవారం పూర్తి చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి అందే ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలన్నారు. విత్డ్రా అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ ముద్రణలో పొరబాట్లకు తావివ్వొద్దన్నారు. సమన్వయంతో పని చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీసీలో జేసీలు డాక్టర్ సిరి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మున్సిపల్ ఆర్డీ నాగరాజు, ఎన్నికల సలహాదారు గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
కోర్టు ధిక్కరణ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి
జిల్లాలో పెండింగ్లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ గంధం చంద్రుడు.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఈ కేసులపై ఆయన పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, డీఆర్వో గాయతీదేవితో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రెవెన్యూ, డ్వామా, పౌరసరఫరాలు, డీపీఓ తదితర శాఖలకు సంబంధించి పెండింగ్లో ఉన్న67 కోర్టు ధిక్కరణ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 6లోపు వకాలత్ ఫైల్ చేయాలన్నారు. కేసులకు సంబంధించిన కౌంటర్ ఫైల్ను ఈనెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 23న మరోసారి ఈ కేసులపై సమావేశం నిర్వహిస్తామనీ, అప్పట్లోగా వకాలత్, కౌంటర్ఫైల్ దాఖలు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వసంతలత, డీపీఓ పార్వతి, ఆర్డీఓలు గుణభూషణ్రెడ్డి, వెంకటరెడ్డి, రామ్మోహన్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.