ఇంటర్ పాసవుతానో లేదోనని ఆత్మహత్యా యత్నం
ABN , First Publish Date - 2022-06-24T05:30:00+05:30 IST
ఇంటర్ పాసవుతానో లేదోననే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మరణించింది.
చిక్సిపొందుతూ విద్యార్థిని మృతి
చిన్నశంకరంపేట, జూన్ 24: ఇంటర్ పాసవుతానో లేదోననే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని కామారం గ్రామంలో చోటు చేసుకున్నది. ఎస్ఐ సుభా్షగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జూకంటి రాములు కుమార్తె కావేరి(17) రామాయంపేట సాయికృప జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో బుధవారం కుటుంబ సభ్యులు కావేరిని ఇంట్లో ఉంచి పొలం పనులకు వెళ్లగా, ఒంటరిగా ఉన్న కావేరి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. కడుపులో మంట రావడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి తీవ్ర అస్వస్థతగా ఉన్నట్టు తెలిపింది. వారు ఇంటికి వచ్చేసరికి వాంతులు చేసుకుంటూ సొమ్మసిల్లి పడిపోయింది. చికిత్స నిమిత్తం నార్సింగిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కావేరి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభా్షగౌడ్ తెలిపారు.