ఆటో బోల్తా ... బాలుడి మృతి

ABN , First Publish Date - 2021-01-17T04:50:39+05:30 IST

ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మృతిచెందగా అతని తల్లిదండ్రులు స్వల్పంగా గాయపడిన ఘటన శనివారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది.

ఆటో బోల్తా ... బాలుడి మృతి
మృతిచెందిన హర్షవర్ధన్‌

మదనపల్లె క్రైం, జనవరి 16: ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మృతిచెందగా అతని తల్లిదండ్రులు స్వల్పంగా గాయపడిన ఘటన శనివారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ చేనేతనగర్‌కు చెందిన ప్రతాప్‌, అశ్విని, కుమారుడు కె.హర్షవర్ధన్‌(3) ముగ్గురూ శనివారం తంబళ్లపల్లె మండలం కొటాలలో ఉన్న బంధువుల ఇంటికి బయల్దేరారు. చేనేతనగర్‌లో ఆర్టీసీ బస్సెక్కి తంబళ్లపల్లెకు వెళ్లారు. అక్కడి నుంచి ఆటోలో కొటాలకు బయల్దేరారు. మార్గమధ్యంలో బోయపల్లె వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బాలుడు ఆటో కిందపడి తీవ్రంగా గాయపడగా, తల్లిదండ్రులకు స్వల్పగాయాలయ్యాయి.  తల్లిదండ్రులు బాలుడిని మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడ హర్షవర్ధన్‌  మృతిచెందాడు. ఒక్కగానొక కుమారుడి మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తంబళ్లపల్లె పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-01-17T04:50:39+05:30 IST