మూడు తెచ్చుకున్నా మూడునట్టే..

ABN , First Publish Date - 2020-10-27T07:08:51+05:30 IST

ఇతర రాష్ర్టాల నుంచి మూడు మద్యం బాటిళ్ల వరకు ఎవరైనా తెచ్చుకునే అవకాశానికి బ్రేక్‌ పడింది. అంతర్‌ రాష్ర్టాల నుంచి మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు తెచ్చుకున్నా మూడునట్టే..

అంతర్‌రాష్ర్టాల మద్యానికి బ్రేక్‌

హైకోర్టు తీర్పు బేఖాతరు చేస్తున్న ప్రొహిబిషన అండ్‌ ఎక్సైజ్‌శాఖ

జీవో ఎంఎస్‌ నంబరు 310ను  విడుదల చేసిన ప్రభుత్వం

యానాం వెళ్లేవారికీ నిరాశే

రెండు నెలలు తిరక్కుండానే మద్యం రవాణాపై ఆంక్షలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఇతర రాష్ర్టాల నుంచి మూడు మద్యం బాటిళ్ల వరకు ఎవరైనా తెచ్చుకునే అవకాశానికి బ్రేక్‌ పడింది. అంతర్‌ రాష్ర్టాల నుంచి మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 2వ తేదీన ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ ఉత్త ర్వులు జారీ చేయడం పట్ల మద్యంప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ రజతభార్గవ్‌ ఈ మేరకు జీవో ఎంఎస్‌ నంబరు 310 సోమవారం విడుదల చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి మద్యం తెచ్చుకో వడంపై ప్రొహిబిషన అండ్‌ ఎక్సైజ్‌శాఖ జీవోను విడుదల చేసింది. పర్మిట్లు లేకుండా ఇతర రాష్ర్టాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు ఎట్టి పరిస్థితు ల్లోనూ అవకాశం లేదని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిళ్లు తేవడానికి కూడా అనుమతి లేదనేది జీవో సారాంశం. కేంద్ర ప్రభు త్వ నిబంధనల ప్రకారం ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు మాత్రమే అవకాశమున్నట్టు పేర్కొంది. పర్మిట్‌ లేకుండా ఇతర రాష్ర్టాల నుంచి మద్యం రవాణాచేస్తే 1968 ఏపీ ఎక్సైజ్‌ చట్టం ద్వారా శిక్షార్హులు అని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ హైకోర్టు సెప్టెంబరు 2వ తేదీన ఇచ్చిన తీర్పు మేరకు అంతర్‌రాష్ర్టాల నుంచి ఒక వ్యక్తి మూడు మ ద్యం బాటిళ్లను తెచ్చుకోవచ్చని స్పష్టం చేయడంతో జిల్లాలో అంతర్‌ రాష్ట్రంగా ఉన్న పాండిచ్చేరి రాష్ట్ర పరిధిలోని యానాం నుంచి చాలామంది మద్యం తెచ్చుకుంటున్నారు. దీనితోపాటు తెలంగాణ, తమిళనాడు, చత్తీస్‌ఘడ్‌, ఒడిశా వంటి రాష్ర్టాల నుంచి కూడా సరిహద్దుల్లో ఉన్న గోదావరి జిల్లాలకు మద్యం తరలివస్తోంది. ఆయా రాష్ర్టాల్లో పేరొందిన కంపెనీలకు చెందిన మద్యం దొరకడం, పైగా తక్కువ ధరకు లభిస్తుండడంతో అందరూ అటువైపు వెళ్లొచ్చేస్తున్నారు. ఇక్కడ మన ప్రభుత్వ మద్యం షాపుల్లో ధరలు ఎక్కువగా ఉండడం తో కొనుగోళ్లు వెలవెలబోతున్నాయనే చెప్పాలి. 

హైకోర్టు తీర్పుకు బ్రేక్‌ పడేనా..

ఇతర రాష్ర్టాల నుంచి మద్యాన్ని తీసుకువచ్చేందుకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబరు 411 ప్రకారం వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు గతంలో కీలక తీర్పు వెలువరించింది. జీవో నంబరు 411 ప్రకారం మద్యాన్ని తీసుకువచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తు న్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారించిన ధర్మాసనం తీర్పును వెలువ రించింది. ప్రతి వ్యక్తి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పు లో పేర్కొంది. దీంతో ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులో ఉన్న తెలంగాణ, యానాం, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ వంటి రాష్ర్టాల నుంచి మందుబాటులు మద్యం తెచ్చుకునే వెసులుబాటు కలిగింది. హైకోర్టు తీర్పుతో అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్‌ సిబ్బంది వేధింపులకు గురవుతున్న మద్యంప్రియులకు ఈ తీర్పు అప్పట్లో ఊరట కలిగించింది. పొరుగు రాషా్ట్రల్లో మద్యం ధరలు తక్కువగా ఉండడం ఒక కారణమైతే, ప్రధానంగా పేరున్న బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉండడం మరొక అంశం. మన రాష్ట్రంలో చూస్తూ ప్రభుత్వం పరిమితంగా ఏర్పాటుచేసిన మద్యం దుకాణాల ద్వారా నాణ్యతలేని నాసిరకం బ్రాండ్‌లకు చెందిన మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలుచేసి తాగితే ఆరోగ్యాలు పాడవుతున్నాయంటూ మద్యంప్రియులు ఇప్పటికే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులు వచ్చి 54 రోజులు తీరక్కుండానే మద్యంప్రియుల ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 



Updated Date - 2020-10-27T07:08:51+05:30 IST