చిత్తూరు ధీశాలి సి. దాస్‌

ABN , First Publish Date - 2022-08-11T07:35:43+05:30 IST

క్విట్‌ ఇండియా ఉద్యమ ప్రభావం జిల్లా యువత మీద ఎంత తీవ్రంగా ఉండేదో ఒక సంఘటన చెబుతుంది. అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్‌ న్యూజాక్‌ బంగళాలోకి అర్ధరాత్రి రహస్యంగా ఒక అగంతకుడు ప్రవేశించాడు.

చిత్తూరు ధీశాలి సి. దాస్‌

తిరుపతి (కల్చరల్‌), ఆగస్టు 7: క్విట్‌ ఇండియా ఉద్యమ ప్రభావం జిల్లా యువత మీద ఎంత తీవ్రంగా ఉండేదో ఒక సంఘటన చెబుతుంది. అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్‌ న్యూజాక్‌ బంగళాలోకి అర్ధరాత్రి రహస్యంగా ఒక అగంతకుడు ప్రవేశించాడు. తుపాకులతో పోలీసు జవాన్లు, కోరలతో కుక్కలూ కాపలాగాస్తున్నాయి. ప్రాణాలకు తెగించి వెళ్లిన అతను కలెక్టర్‌ బాత్‌రూమ్‌ గోడ మీద ‘‘తెల్లజాతి వెధవల్లరా మా దేశం విడిచి పొండి’’ అని రాసి వచ్చాడు. ఆ వీరుడి పేరు సి.దాస్‌. ఈ చర్యకు దేశద్రోహ నేరం మోపి జైల్లో వేసినా చలించని ధీరుడు అతను. జైలు నుంచి విడుదల కాగానే నేరుగా బందరులోని గాంధీ ఆశ్రమంకి వెళ్లారు. 7వ తేదీన చలిచీమలపల్లిలో ఒక హరిజన కుటుంబంలో పుట్టిన దాస్‌ ఎస్‌ఎ్‌సయల్‌సీ చదువుకున్నారు. సెకండరీ గ్రేటు టీచర్‌ గా శిక్షణ తీసుకుని 1942లో చిత్తూరు సమీపంలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేరారు.  1942లో రామానుజ అయ్యంగార్‌ సారధ్యంలో చిత్తూరులో క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలు కాగానే అందులో భాగం అయ్యారు. స్వాతంత్య్రం వచ్చాక 1948లో పుంగనూరు తాలూకా రాయల్‌ పేట రిజర్వు సీటు నుంచి జిల్లాబోర్డు సభ్యుడుగా గెలుపొందారు. 1962లోనూ, 1967లోనూ తిరుపతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1963లో టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. 1970లో రాష్ట్రంలో పివినరశింహారావు మంత్రివర్గంలోనూ, 1978లో మర్రిచెన్నారెడ్డి మంత్రివర్గంలోనూ దాస్‌ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రపిసిసి అధ్యక్షుడుగా కూడా పనిచేసిన దాస్‌ జీవితాంతం అంటరానితనం నిర్మూలన కోసం కృషి చేశారు. 20 జనవరి 2001న ఆయన కన్నుమూశారు.

Updated Date - 2022-08-11T07:35:43+05:30 IST