కాణిపాక ఆలయ సిబ్బందికి కరోనా

ABN , First Publish Date - 2021-04-18T05:46:10+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

కాణిపాక ఆలయ సిబ్బందికి కరోనా
ఆలయ అణివేటి మండపాన్ని హైపోక్లోరైడ్‌తో శుభ్రం చేస్తున్న సిబ్బంది

భక్తులకు మహాలఘు దర్శనం అమలు

ఆలయంలో ఆర్జిత సేవల కుదింపు

ఐరాల(కాణిపాకం), ఏప్రిల్‌ 17: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం ఆలయ సిబ్బందిలో ఐదుగురికి కరోనా నిర్ధారణ కాగా శనివారం మరో నలుగురికి కరోనా సోకింది. ఆలయంలో పనిచేసే అర్చకులు, సిబ్బంది కరోనా బారినపడుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయంలో కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ఆలయ సిబ్బందికి రెండో దఫా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లను హైపోక్లోరైడ్‌తో  శుభ్రం చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను అధికారులు కుదించారు. ఇందులో భాగంగా స్వామికి మూడు కాలాల్లో నిర్వహించే పంచామృతాభిషేకాల్లో వేకువ జామున 5.30, 9 గంటలకు నిర్వహించే అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు.  11 గంటలకు స్వామికి నిర్వహించే అభిషేకం టికెట్లను 20 మాత్రమే ఇవ్వనున్నారు. దీంతో పాటు స్వామికి  రెండుసార్లు క్షీరాభిషేకం చేస్తుండగా బ్యాచ్‌కు 20 టికెట్లను మాత్రమే ఇస్తున్నారు. 11 గంటలకు నిర్వహించే గణపతి హోమానికి 20 టికెట్లను కేటాయిస్తున్నారు. నిజరూప దర్శనం, ప్రమాణాలు, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం సేవలను పూర్తిగా రద్దు చేశారు.


Updated Date - 2021-04-18T05:46:10+05:30 IST