సాగు లెక్క ఇక పక్కా
ABN , First Publish Date - 2020-07-14T10:43:25+05:30 IST
గుంట భూమి మొదలుకుని ఎన్ని ఎకరాల్లో ఏ పంట సాగుచేస్తున్నారో రైతుల వారీగా లెక్కలు తెలుసుకునేందుకు
రైతువారీగా సాగు వివరాల నమోదు షురూ
నియంత్రిత సాగు నేపథ్యంలో సేకరణ
ఏఈవోలు, రైతుబంధు సభ్యులే కీలకం
ఆన్లైన్లో పంట విస్తీర్ణం గణాంకాలు
సిద్దిపేట అగ్రికల్చర్, జూలై 13 : గుంట భూమి మొదలుకుని ఎన్ని ఎకరాల్లో ఏ పంట సాగుచేస్తున్నారో రైతుల వారీగా లెక్కలు తెలుసుకునేందుకు ఎట్టకేలకు వ్యవసాయశాఖ నడుం బిగించింది. ఇది వరకే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయి. క్రాప్ బుకింగ్ పోర్టల్ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం దీనికి కారణంగా మారింది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి, సోమవారం వ్యవసాయ అధికారులు జిల్లాలోని 126 క్లస్టర్లలో ఈ సర్వేకు శ్రీకారం చుట్టారు. మార్కెటింగ్, ఎరువుల అవసరం, లభ్యత, విత్తనాల దిగుమతులు, ఎగుమతులు, పంట దిగుబడి, ప్రాసెసింగ్ వంటి ముఖ్యమైన అవసరాలకు దీని ద్వారా ప్రణాళిక రూపొందిస్తారు.
సర్వేతో ప్రయోజనాలు
ఈ సర్వేలో ముఖ్యంగా రైతు పేరు, సర్వే నంబరు, పంట వివరాలు, సాగు ఎకరాలు వంటి వివరాలను నమోదు చేస్తారు. జిల్లాలోని 23 మండలాల్లో 126 క్లస్టర్లు ఉన్నాయి. ఏఈవోలు తమ క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు వెళ్లి రైతుబంధు సభ్యులతో కలిసి సర్వే చేస్తారు. అనంతరం పూర్తి వివరాలను ట్యాబ్లో నమోదు చేస్తారు. ఈ సర్వే వల్ల రైతుల వారీగా, క్లస్టర్ల వారీగా, మండలాల వారీగా, జిల్లా మొత్తంగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నదో ఒక అవగాహన వస్తుంది. దీని ప్రకారం ఆ పంట దిగుబడిపై ఒక అంచనా ఉంటుంది. పంట కొనుగోలు సమయంలో రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడానికి వీలవుతుంది. ఆ దిగుబడిని మార్కెట్లో అమ్మడానికి దళారుల ప్రమేయాన్ని నివారించడానికి అనువుగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఉద్యాన పంటలు కూడా..
వానాకాలం పంటల వివరాలను పొందుపర్చేందుకు 17 పేజీలతో సాఫ్ట్వేర్ రూపొందించారు. సర్వే మార్గదర్శకాలను వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సర్వే చేయాల్సిన అధికారులకు తెలియజేశారు. పచ్చిరొట్ట, అపరాల సాగు మొదలుకొని, విత్తన ఉత్పత్తి, అంతర పంట వివరాలు, సేంద్రియ సాగు చేసే రైతులు, వారు సాగు చేస్తున్న పంటలు, ఉద్యానపంటలైతే చెట్ల వయసు, సంఖ్యను కూడా సేకరించి పోర్టల్లో నమోదు చేస్తారు. జూన్16 వరకు డిజిటల్ సిగ్నేచర్ అయిన ప్రతి సర్వేనంబర్ భూమిని క్రాప్ బుకింగ్ పోర్టల్లో పొందుపర్చారు. రైతుల వారీగా సేకరించిన వివరాలను ఏఈవోలు పోర్టల్లో నమోదు చేస్తున్నారు. డిజిటల్ సైన్ కాని సర్వే నంబర్లు ఉంటే వెంటనే నమోదు చేయించుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
రైతుకు ప్రయోజనకరం: శ్రావణ్ కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ఇది పూర్తిగా రైతుకు మేలు చేసేందుకే రూపొందించిన కార్యక్రమం. రైతు వారీగా పంట వివరాలు తెలుసుకోవడం వల్ల పంట విక్రయించే సమయంలో ఉపయోగంగా ఉంటుంది. దళారులను ఆశ్రయించి మోసపోయే అవకాశం ఉండదు. ఏఈవోలు రైతుబంధు సభ్యుల సహాయంతో క్షేత్రస్థాయిలో సర్వే చేసి రైతుల వివరాలు, వారు సాగు చేస్తున్న పంటల లెక్కలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. రైతులు తప్పనిసరిగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలి. తమ పంటల వివరాలను సర్వే అధికారులకు వివరించాలి.