ధర్మ పరిరక్షణ యాత్రను అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-01-22T05:54:31+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలో పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్మపరిరక్షణ యాత్ర ఉద్రిక్తతకు దారితీసింది.
గృహ నిర్బంధంలో టీడీపీ నేతలు
గోదావరి సిటీ, జనవరి 21: తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలో పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్మపరిరక్షణ యాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ యా త్రను నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. కాగా గృహనిర్భందంలో భాగంగా తిరుపతిలోని హోటల్లో ఉన్న తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడుతో కలిసి తిరుమల అలిపిరి నుంచి యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న నేతలను ఆయన ఉన్న హోటల్ గేటువద్ద నిలువరించారు. తమ ను హోటల్లోనికి పంపించాలంటూ నేతలంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు), ఎమ్మెల్యే అభ్యర్ధి గాలి భానుప్రకాష్ని లోనికి పంపించారు. ఈసందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ధర్మపరిరక్షణా యాత్ర ను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించి జగన్ సర్కార్పై మండిపడ్డారు. మాజీ మంత్రి ఎన్.అమర్నాధ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు పులవర్తి నాని, తిరుపతి ఎంపి అభ్యర్థిని పనబాక లక్ష్మి, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల రాజా, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పెందుర్తి వెంకటేష్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు, ఆయా మండల పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుని కలిశారు. కాగా పోలీసులు నేతలకు 41వ నోటీసులను ఇచ్చి ర్యాలీని రద్దు చేశారు.