22,805 మంది రైతులకు అందని రైతుబంధు
ABN , First Publish Date - 2020-07-14T10:46:52+05:30 IST
రైతుబంధు సాయం కొంత మందికి సక్రమంగా అందడం లేదు. బ్యాంకు ఖాతాలు, ఆధార్కార్డుల వివరాలు సక్రమంగా
బ్యాంకు ఖాతాలు లేక సాయానికి దూరం
1300 మంది రైతుల బ్యాంకు ఖాతాలు రద్దు
రేపటిలోగా ముగియనున్న గడువు
సంగారెడ్డి టౌన్, జూలై 13 : రైతుబంధు సాయం కొంత మందికి సక్రమంగా అందడం లేదు. బ్యాంకు ఖాతాలు, ఆధార్కార్డుల వివరాలు సక్రమంగా లేకపోవడంతో వేలాది మంది రైతులు పెట్టుబడి సాయం పొందలేకపోతున్నారు. వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 22,805 మంది రైతులకు రెండేళ్లుగా పంట పెట్టుబడి సాయం అందడం లేదు. వీరికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయ అధికారులకు ఇవ్వకపోవడంతో రైతుబంధు సాయాన్ని కోల్పోయారు.
అయితే ఇప్పటివరకు రైతుబంధు సాయం పొందని పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులందరూ రేపటిలోగా వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని ఆ శాఖ జిల్లా అధికారి నర్సింహారావు సూచించారు. వానాకాలం సీజన్లో జిల్లాలో మొత్తం 3,13,101 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.385.12 కోట్లు అవసరముంటుందని అధికారులు అంచనా వేశారు. వీరిలో 2,87,436 మంది రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతానంబర్లు, ఆధార్నంబర్లను సేకరించారు. ఇందులో 2,84,718 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.362.72 కోట్లు జమ అయినట్లు అధికారులు తెలిపారు.
మిగిలిన 2,718 మంది రైతుల్లో 1300 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు వివిధ కారణాలతో బ్యాంకు ఖాతాలు రద్దు (క్లోజ్) చేయడంతో వారు రైతుబంధు సాయం అందలేదు. ఈ లెక్కన మొత్తం 24,105 మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల వివరాలను స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేస్తే పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంటుందని ఆ శాఖ జిల్లా అధికారి నర్సింహారావు తెలిపారు.