డివైడర్‌ పనుల్లో అవకతవకలు

ABN , First Publish Date - 2021-03-02T05:47:31+05:30 IST

అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై చేపట్టిన రోడ్డు డివైడర్‌ పనులో అవకతవకలు జరిగాయని మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు అన్నారు.

డివైడర్‌ పనుల్లో అవకతవకలు
అదనపు కలెక్టర్‌ వీరారెడ్డికి ఫిర్యాదును అందజేస్తున్న చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు

నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌ పనులు చేపట్టారు

అడిషనల్‌ కలెక్టర్లకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు

జోగిపేట, మార్చి 1 : అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై చేపట్టిన రోడ్డు డివైడర్‌ పనులో అవకతవకలు జరిగాయని మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు అన్నారు. టెండర్‌లో పేర్కొన్న విధంగా కాకుండా.. సగం దూరమే నిర్మించి మొత్తం పనులకు నిధులు కాజేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు సోమవారం అదనపు కలెక్టర్లకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జంట పట్టణాల పరిధిలో నిర్మించిన డివైడర్‌ పనుల పూర్తి వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశానని కాంగ్రెస్‌ నాయకుడు తాటికొండ శ్రీధర్‌ తెలిపారు. ఆర్టీఐ సమాచారం మేరకు అందోలులోని గురుకుల పాఠశాల నుంచి అన్నాసాగర్‌ దర్గా వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర డివైడర్‌ పనులు చేపట్టాలని టెండర్‌ నిబంధనల్లో ఉండగా.. కేవలం 2 కిలో మీటర్లే పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలను తుంగలో తొక్కిన కాంట్రాక్టర్‌ (ఏఎ్‌సఏ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ) రెండు కిలోమీటర్ల మేర నాసిరకంగా డివైడర్లను నిర్మించడమే కాకుండా.. 75 శాతానికి పైగా పనులు చేసినట్టు బిల్లులు పొందాడని ఆయన ఆరోపించారు. డివైడర్‌ పనులపై విచారణ జరిపి, అవకతవకలకు పాల్పడ్డ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అడిషనల్‌ కలెక్టర్లు రాజర్షిషా (మున్సిపల్‌), వీరారెడ్డి (పంచాయతీరాజ్‌)లతో పాటు పబ్లిక్‌ హెల్త్‌ డివిజన్‌ సూపరింటెండెంట్‌కు శ్రీధర్‌ నేతృత్వంలో కాంగ్రె్‌సకు చెందిన నాయకులు కొశికె రాజశేఖర్‌, సైలాన్‌, బీజేపీ మండల అధ్యక్షుడు అవుసలి నవీన్‌, పట్టణాధ్యక్షుడు సాయి ఫిర్యాదు చేశారు.



Updated Date - 2021-03-02T05:47:31+05:30 IST