వైద్య సేవలను నిర్లక్ష్యం చేయొద్దు
ABN , First Publish Date - 2022-05-28T05:15:10+05:30 IST
వైద్య సేవలను నిర్లక్ష్యం చేయొద్దు
- రంగారెడ్డి డీఎంహెచ్వో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి
షాద్నగర్రూరల్, మే27: పేదలకు అందించే వైద్యసేవల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని రంగారెడ్డి డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి సూచించారు. షాద్నగర్ ఎంపీడీఓ సమావేశం హాలులో శుక్రవారం వైద్య సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి కాన్పూ ఆసుపత్రిలోనే జరిగేలా చూడాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్ ఇవ్వాలని సూచించారు. ఎన్సీడీ కేసులకు వెంటనే గుర్తించి వైద్యసేవలు అందించాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీడీ సేవలను పెంచాలన్నారు. పీహెచ్సీ ల్యాబ్లలో అన్ని రకాల పరీక్షలు చేయాలని, గర్భవతులను గుర్తించి మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు. సిజేరియన్ కాన్పులను నిరోధించాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ చేస్తే గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్చరించారు. పీహెచ్సీల్లో జూన్ మొదటి వారంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సిబ్బంది కచ్చితంగా ఆసుపత్రిలోనే ఉండాలన్నారు. సమావేశంలో డాక్టర్ అరుణ కుమారి, డాక్టర్ స్వర్ణకుమారి, డాక్టర్ సల్మాన్, డాక్టర్లు కవిత, అమృత జోసఫ్, విజయలక్ష్మి, సిబ్బంది శ్రీనివాసులు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.