జిల్లాలో కొత్తగా 99 మహిళా సంఘాల ఏర్పాటు
ABN , First Publish Date - 2021-03-06T05:49:56+05:30 IST
జిల్లాలో కొత్తగా 99 మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య తెలిపారు.
జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి భీమయ్య
ఎర్రకుంటలో కొత్త సంఘాలకు శిక్షణ
నర్సాపూర్, మార్చి 5: జిల్లాలో కొత్తగా 99 మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య తెలిపారు. శుక్రవారం నర్సాపూర్ మండలంలోని ఎర్రకుంట తండా పంచాయతీలో కొత్తగా ఏర్పడిన మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన భీమయ్య మాట్లాడుతూ సభ్యులు ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, సెర్ప్ ద్వారా నైపుణ్యం పెంచుకుని ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కొత్త సంఘాల ఏర్పాటులో నర్సాపూర్ మండలం రెండో స్థానంలో ఉండటం పట్ల భీమయ్య ఇక్కడి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీసీ రవీందర్, సీఆర్పీలు రజనీ, మీన, సీఏ మాధవి తదితరులు పాల్గొన్నారు.
తూప్రాన్ మండలంలో 33 సంఘాలు
తూప్రాన్రూరల్, మార్చి 5: ప్రభుత్వం అందిస్తున్న సాయంతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో మండలంలో కొత్తగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసే కార్యక్రమాలు గ్రామాల్లో కొనసాగుతున్నట్లు మండల ఐకేపీ ఏపీఎం రామక్రిష్ణ తెలిపారు. ప్రస్తుతమున్న 396 గ్రూపులకు తోడుగా మరో 50 కొత్త గ్రూపులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో 33 గ్రూపులు ఏర్పడ్డాయని తెలిపారు. యావాపూర్లో 5 కొత్త సంఘాలు ఏర్పాటయ్యాయని, దీంతో మండలంలో 429 గ్రూపులు ఉన్నాయన్నారు.