Fire Accident: చిత్తూరు పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
ABN , First Publish Date - 2022-09-21T16:58:05+05:30 IST
చిత్తూరు (Chittoore): నగరంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది.
చిత్తూరు (Chittoore): నగరంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. రంగాచారి వీధిలోని పేపర్ పేట్ల తయారీ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మంటల్లో చిక్కుకున్న పరిశ్రమ యజమాని భాస్కర్ (65), ఢిల్లీబాబు (35), బాలాజీ (25) మృతిచెందారు. సమాచారం తెలుసున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
చిత్తూరు రంగాచారి వీధిలో రెండంతస్తుల భవనంలో పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. పేపర్ ప్లేట్లు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేపర్ ప్లేట్లకు అంటుకోవడంతో భారీగా మంటలు భవనంలోకి వ్యాపించాయి. ఆ భవనంలో కుటుంబం కూడా నివసిస్తోంది. అంతా నిద్రమత్తులో ఉండడంతో పెద్ద ప్రమాదం జరిగింది. తండ్రి భాస్కర్, కుమారుడు ఢిల్లీబాబు, అతని స్నేహితుడు బాలాజీ.. ముగ్గురు సజీవదహనమయ్యారు. ఇంకా లోపల చిక్కుకున్నవారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా నిన్న ఢిల్లీబాబు జన్నదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అదే రోజు ఆయన మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.