సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2021-06-16T05:17:35+05:30 IST
మునిసిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని పారిశుధ్య కార్మిక సంఘ నాయకులు హెచ్చరించారు.
డప్పులు కొడుతూ.. వీధులను ఊడ్చి పారిశుధ్య కార్మికుల నిరసన
పలాస: మునిసిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని పారిశుధ్య కార్మిక సంఘ నాయకులు హెచ్చరించారు.ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మినెంట్ చేయాలని పారిశుధ్య కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరింది. పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈసందర్భంగా మునిసిపల్ మేనేజర్ బిసాయ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, కార్మిక సంఘ నాయకుడు సీహెచ్ మురుగన్, దివాకర్, ప్రకాష్ పాల్గొన్నారు. ఫఇచ్ఛాపురం: తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మునిసిపల్ పారిశుధ్య కార్మికులు రెండో రోజు మంగళవారం కూడా సమ్మె కొనసాగించారు. విధులు బహిష్కరించి తహసీల్దార్, మునిసిపల్ కార్యాలయాల వద్ద సమ్మె నిర్వహిం చారు. అనంతరం డీటీ శ్రీహరికి వినతి పత్రం అందజేశారు.ఫ పాలకొండ: నగర పంచాయతీలో పారిశుధ్య కార్మికులు మంగళవారం వినూత్న నిరసన తెలిపారు. కార్మికులు డప్పులు కొడుతూ చీపుర్లకు ఎర్రజెండాలు కట్టి వీధులు ఊడ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు దావాల రమణారావు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాల ని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజాం రూరల్: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామ్మూర్తినాయుడు డిమాండ్ చేశారు. ఇక్కడి నాలుగు రోడ్ల కూడలి వద్ద మంగళవారం కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.