నిధుల మంజూరు సరే.. ఆర్వోబీ నిర్మాణం ఎప్పుడో?
ABN , First Publish Date - 2021-06-21T05:56:46+05:30 IST
మదనపల్లె మండలం సీటీఎంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారని స్థానికులతోపాటు వాహన దారులు ఎదురు చూస్తున్నారు.
మదనపల్లె, జూన్ 20: మదనపల్లె మండలం సీటీఎంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారని స్థానికులతోపాటు వాహన దారులు ఎదురు చూస్తున్నారు. ఆర్వోబీ కోసం నేష నల్ హైవే ఆఫ్ అఽథారిటీ(ఎన్హెచ్ఏఐ) రూ.50 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయి తే బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ, ఈ-ప్రాజెక్టు అంచనాల డీపీఆర్ ఇంకా మొదటి దశలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆర్వోబీ నిర్మాణ పనులు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపి స్తోంది. తిరుపతి-మదనపల్లె ప్రధాన రహదారిపై ఆర్వోబీ నిర్మించాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా ఉంది. కానీ పనులు కార్యరూపం దాల్చడానికి ఎన్హెచ్ఏఐ, రైల్వే, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేక పోవడంతో పనులు ప్రారంభంలో జాప్యం జరుగు తోంది. రైలు గేటు పడితే కనీసం 15-20 నిమిషాల సమయం వాహనదారులు వేచి ఉండాల్సి వస్తోంది. ఆర్వోబీ పూర్తయితే మదనపల్లె-తిరుపతి మార్గంలోని వాహనదారులు నిరీక్షించే పరిస్థితులు తొలగి పోతాయి. పైగా సీటీఎంకు 7 కి.మీ దూరంలో వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన ముగియడంతో ఈ మార్గానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
డబుల్రోడ్డుపై నిర్మాణానికి ఓకే!
మదనపల్లె-తిరుపతి మార్గంలో నాలుగులేన్ల రహదారికి భూసేకరణ ప్రక్రియ పూర్తైంది. ఇది కూడా ఆర్వోబీ నిర్మాణానికి ఆలస్యమైనట్లు చెబుతున్నారు. దీనికంతటికీ చెక్పెడుతూ... రెండు లేన్లపైనే ఆర్వోబీ నిర్మించాలనే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇస్తూ, నిధులు మంజూరు చేసిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే భూ సేకరణ, అలైన్మెంట్ పనులు పెండింగ్ ఉన్నట్లు చెబుతున్నారు. సీటీఎంలో ప్రధాన రహదారిని రైల్ క్రాస్ చేస్తున్న పాయింట్ నుంచి రెండు వైపులా 750 మీటర్ల చొప్పున మొత్తం 1.50కి.మీ. దూరం ఆర్వోబీ నిర్మించనున్నారు. బ్రిడ్జి క్యారియర్ 10మీటర్లు, బ్రిడ్డికి రెండు వైపులా 5.50 మీటర్ల వెడల్పుతో రెండు సర్వీసురోడ్లు నిర్మించనున్నట్లు డీపీఆర్లో పొందు పరిచారు. ఇందుకోసం 35 మీటర్ల వెడల్పుతో రైతుల నుంచి భూమిని సేకరించనున్నారు. సీటీఎం క్రాస్ రోడ్డు సమీపంలోని గంగమ్మగుడి నుంచి ఆంజనేయ స్వామిగుడి వద్ద రోడ్డు దిగేలా మార్కింగ్ ఇచ్చారు. ఈ మార్గంలోని ట్రాఫిక్ను, ప్రయాణ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్వోబీని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.