జీజీహెచ్లో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు
ABN , First Publish Date - 2022-05-25T07:36:57+05:30 IST
నవజాత శిశువులకు, ప్రసవంలో తల్లిని కోల్పోయిన చంటి పిల్లలకు తల్లిపాలను అందించేలా రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ (మానవ పాల బ్యాంక్) ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్
కాకినాడ క్రైం, మే 24: నవజాత శిశువులకు, ప్రసవంలో తల్లిని కోల్పోయిన చంటి పిల్లలకు తల్లిపాలను అందించేలా రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ (మానవ పాల బ్యాంక్) ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మంగళవారం జరిగిన ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధి సమావేశంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి, రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ప్రభావతి అతిథులుగా పాల్గొన్నారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సింహరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్ధ హాజరయ్యారు. కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన సుషేన హెల్త్ ఫౌండేషన్ సంస్థ మానవ పాల బ్యాంక్ స్థాపించేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఆసుపత్రిలో క్యాజూవాలిటీ, ఓపీడీ, మెడిసిన్ బ్లాక్లలో లిఫ్ట్ల నిర్వహణకు నిధులు మంజూరు చేశామన్నారు. .ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ట్రామాకేర్ సెంటర్ భవనం పైన క్యాథ్ ల్యాబ్ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.1.20 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. జీజీహెచ్ గైనిక్ విభాగం ఆల్ ఇండియా స్థాయిలో మూడో స్థానం, సౌత్ ఇండియాలో మొదటి స్థానం పొందడంపై సేవలందించిన వైద్యులను అభినందించారు. తొలుత జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటబుద్ధ గత సమావేశంలో కమిటీ ఆమోదించిన అంశాలపై తీసుకున్న చర్యలను వివరించారు. పది అంశాలతో కూడిన ప్రస్తుత అజెండాను సమావేశం ముందుంచారు.