హోరెత్తిన మల్లన్న 7వ వారం జాతర
ABN , First Publish Date - 2021-03-01T05:39:13+05:30 IST
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం భక్తజనమయంగా మారింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ వారం జాతరను పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు.
చేర్యాల, ఫిబ్రవరి 28: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం భక్తజనమయంగా మారింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ వారం జాతరను పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి దాదాపు 2గంటలపాటు సమయం పట్టింది. సాంప్రదాయబద్ధంగా మల్లన్నకు బెల్లం పాయసంతో బోనం నివేదించి చెలక, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. తమ కోర్కెలు తీర్చాలని వేడుకుంటూ గంగిరేగుచెట్టుకు ముడుపు కట్టారు. మల్లన్న సహోదరి ఎల్లమ్మతల్లికి భక్తిప్రపత్తులతో బోనం నివేదించారు. ఈవో బాలాజీ, పునరుద్ధరణ కమిటీ సభ్యులు వజ్రోజు శంకరాచారి, తాళ్లపల్లి శ్రీనివాస్, ఉట్కూరి అమర్, ఏఈవోలు గంగా శ్రీనివాస్, వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీలశేఖర్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.