ఘోరం!

ABN , First Publish Date - 2021-03-01T05:45:34+05:30 IST

ధినిస్తున్న వృత్తే మృత్యువై కాటువేసింది. ట్రాక్టరు టైరు పేలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. కొమనాపల్లిలో ఆదివారం

ఘోరం!
మృతిచెందిన సూర్యనారాయణ





ఘోరం!

 ఉపాధినిచ్చిన వృత్తే మృత్యువై...

 ట్రాక్టరు టైరు పేలి ఇద్దరు దుర్మరణం

 కొమనాపల్లి కూడలిలో ఘటన

జలుమూరు, ఫిబ్రవరి 28: ఉపాధినిస్తున్న వృత్తే మృత్యువై కాటువేసింది. ట్రాక్టరు టైరు పేలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. కొమనాపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది ఈ విషాద ఘటన. ఇందుకు సంబంధించి జలుమూరు పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కొమనాపల్లి కూడలిలో అదే గ్రామానికి చెందిన దాసరి సూర్యనారాయణ (52)  చాలా ఏళ్లుగా సైకిల్‌ షాపు నిర్వహిస్తున్నారు. బైక్‌లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు పంక్చర్లు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవింద (45) తన ట్రాక్టరు టైరు పంక్చరు వేయించేందుకు వచ్చారు. పంక్చరు వేసి  గాలి నింపుతుండగా టైరు పేలిపోయింది. సూర్యనారాయణ డిస్కుతో సహా ఎగిరి పైనున్న విద్యుత్‌ వైర్లకు తగిలి కిందకు పడిపోయాడు. ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. పక్కనున్న గోవింద ముఖంపై తీవ్రగాయాలవ్వడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. స్థానికులు గుర్తించి 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ శబ్ధం రావడంతో భయాందోళనతో పరుగులుతీశారు. ఏం జరిగిందో తెలిసేలోగా సూర్యనారా యణ రక్తపుమడుగులో పడి ఉండడాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. సూర్యనారాయణకు భార్య రమణమ్మ,  కుమార్తె అనూష, బీటెక్‌ చదువుతున్న కుమారుడు సాయి ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహమైంది. గోవిందకు భార్య రమణమ్మ, కుమార్తె సంధ్య, కుమారుడు శివ ఉన్నారు.  పిల్లలిద్దరూ చదువుతున్నారు. ఈ ఘటనతో కొమనాపల్లి, తిమడాంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి ఎస్‌ఐ కృష్ణ సిబ్బందితో చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 




Updated Date - 2021-03-01T05:45:34+05:30 IST