నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
ABN , First Publish Date - 2021-03-06T05:51:51+05:30 IST
‘‘తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం వివక్ష వహిస్తుంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులకు అడ్డుపడుతుంది
తెలంగాణపై కేంద్రం వివక్ష జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి
చేర్యాల, మార్చి 5: ‘‘తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం వివక్ష వహిస్తుంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులకు అడ్డుపడుతుంది. ఈ విషయమై తెలంగాణ బిడ్డలుగా తమ అధిష్టానాన్ని నిలదీయకుండా సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్న బీజేపీ నేతలు కేంద్రప్రభుత్వ వివక్ష నిజం కాదని నిరూపిస్తే జనగామ నియోజకవర్గంలోని అంబేడ్కర్ విగ్రహాల ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో ముక్కునేలకు రాస్తా’’ అని జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పలు గ్రామాల్లో పట్టభద్రులను కలిసి పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం చేర్యాలలోని ఓఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయసమ్మేళనంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షల కోట్లాది రూపాయలు దండుకుంటున్నా అభివృద్ధికి సహకరించకపోగా, తెలంగాణను బాగుచేయాలన్న సంకల్పం, లక్ష్యంతో సీఎం కేసీ ఆర్ సంస్కారంతో ప్రాజెక్టులు, నిధులు ఇవ్వాలని ప్రధానికి దండంపెట్టి దరఖాస్తు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. ఈవిషయమై బీజేపీ నేతలు కిషన్రెడ్డి, బండి సంజయ్ దుష్ప్రచారం చేస్తుండటం శోచనీయమన్నారు
జైలుపాలైన వారికే సంక్షేమ పథకాలు
స్వరాష్ట్ర సాధనకు పోరాటంలో లాఠీ దెబ్బలు తిని కేసులు, జైలుపాలైన తెలంగాణ బిడ్డలకే సంక్షేమ ఫలాలు, పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం తిప్పలు పడిన వారిని గుర్తించి న్యాయం చేకూర్చడం కనీస బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శెట్టె మల్లేశం, ఎంపీపీ వుల్లంపల్లి కరుణా కర్, మునిసిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.