మూసివేత దిశగా...
ABN , First Publish Date - 2021-07-22T05:18:05+05:30 IST
కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు జిల్లాలో డెల్టా వేరియంట్ గుబులు పుట్టిస్తోంది. కేసుల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో కొవిడ్కేర్ సెంటర్లు ఒక్కొక్కటీ మూత పడుతుండడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.
- కొవిడ్ కేర్ సెంటర్లకు స్వస్తి
- మరోవైపు డెల్టా ప్లస్ వేరియంట్ గుబులు
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు జిల్లాలో డెల్టా వేరియంట్ గుబులు పుట్టిస్తోంది. కేసుల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో కొవిడ్కేర్ సెంటర్లు ఒక్కొక్కటీ మూత పడుతుండడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. రెండో దశ కరోనా విజృంభణ నేపథ్యంలో టెక్కలి, పాలకొండ, ఎచ్చెర్లలో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లను మూసేశారు. శ్రీకాకుళం మండలం పాత్రునివలసలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కొవిడ్ కేర్ సెంటర్ను కూడా మూసివేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ వేలాది మంది కరోనా బాధితులు.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. గత మూడు రోజులుగా ఈ కేంద్రంలో ఒక్క బాధితుడు కూడా లేడు. దీంతో ఈ కేంద్రాన్ని మూసివేయనున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ లక్షణాలున్న వారిని గుర్తించి కేర్ సెంటర్లకు తరలించాల్సిన అవసరం ఉన్నా... ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదనే వాదనలు వినిస్తున్నాయి. కేర్ సెంటర్లు కొనసాగిస్తారా? లేదా అనేది స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం పగలంతా కర్ఫ్యూ సడలించడంతో ఎక్కడికక్కడ జన రద్దీ పెరిగింది. దీంతో మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉంది. ఆగస్టు, సెప్టెంబరు నాటికి కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. డెల్టాప్లస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ కేర్ సెంటర్లు కొనసాగించడమే మేలు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి మూసివేసినా... మళ్లీ కేసులు పెరిగితే.. కొవిడ్ కేర్ సెంటర్లు తెరిచే అవకాశం ఉందని జిల్లా కరోనా సమన్వయ వైద్యాధికారి బగాది జగన్నాఽథరావు తెలిపారు.