ప్రకృతి నియమాలను అనుసరించాలి
ABN , First Publish Date - 2021-06-21T05:17:09+05:30 IST
ప్రకృతి నియమాలను అనుసరించాలి
- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
- ఇబ్రహీంపట్నంలోని తట్టిఖానా గోపాల్ గోశాలలో సామూహిక యోగా కార్యక్రమం
ఆదిభట్ల : ప్రకృతి ప్రసాదించిన నియమాలను అనుసరిస్తూ జీవనం సాగించాలని, లేకపోతే మానవజాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తట్టిఖానా గోపాల్ గోషాలలో ఆదివారం సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. సదాశివ యోగా విజ్ఞాన పీఠం సౌజన్యంతో ప్రముఖ యోగాచార్యులు రవిందర్ బాపూజీ స్వీయ పర్యవేక్షణలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, సిద్ధార్థ యోగ విద్యాలయల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక, శారీరక, ఆధ్యాత్మికతను సమతుల్య పరచడమే యోగ ప్రక్రియలో ప్రధానమన్నారు. ప్రకృతి మాతను కాపాడుకుంటూ ముందుకు సాగితేనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని, లేనిపక్షంలో విపత్తులు తప్పవని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటలకు అగ్నిహోత్రం, గోమాత పూజ, అనంతరం కేంద్రప్రభుత్వం ఇచ్చిన యోగా ప్రొటోకాల్ను అనుసరించి సామూహిక యోగ సాధన, యోగ క్యాలెండర్ ఆవ్రిష్కరణ, యోగాచార్యులకు ఆత్మీయ సన్మానం, యోగా ప్రదర్శనలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమం చివరలో వెయ్యి మీటర్ల జాతీయజెండా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ గ్లోబల్ ప్రతిష్టాన్ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, కన్వీనర్ దశరథ్గౌడ్, యోగా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరయ్య, యోగాచార్యులు సుబ్రమణ్యం బాపూజీ, ఇస్మాయిల్ గురూజీ, నరసింహస్వామి, కో-ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, 200 మంది యోగసాధకులు, తదితరులు పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లాలోని వినోభా ప్రకృతి ఆశ్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, సిద్దార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా గోపాల్ గోషాలను సందర్శించారు. మానసిక ఒత్తిడిని జయించడానికి యోగ దివ్యౌషధమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్రెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థల రాష్ట్ర అధ్యక్షుడు కండాల పాపిరెడ్డి, కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, విద్యాసంస్థల నిర్వాహకుడు రమణారెడ్డి, ప్రముఖ కవి, రచయిత గోపాల్జీ, యోగా గురువులు బొమ్మపాల గిరిబాబు, రాజు, అశోక్, వాణిదేవి, కడ్తాల ఎంపీపీ కమ్లీమోత్యనాయక్, నాయకులు సురేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.