సమన్వయంతో పనిచేయాలి
ABN , First Publish Date - 2020-12-03T05:56:00+05:30 IST
గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి కోరారు.
మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి
కొల్చారం, డిసెంబరు 2: గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి కోరారు. బుధవారం కొల్చారంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. యాసంగి సీజన్ ప్రారంభమవుతున్నందున వ్యవసాయఅధికారులు రైతులకు సలహాలు, సూచనలు చేయాలన్నారు. ఎంపీపీ మంజుల మాట్లాడుతూ.. ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు లేకపోవడంతో పనులు చేయలేకపోతున్నారని, నిధులు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. సమావేశంలో ఎంపీడీవో కృష్ణవేణి, తహసీల్దార్ ప్రదీప్, ఆర్డడబ్ల్యూఎస్ డీఈఈకిషన్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
కౌడిపల్లి మండల సమావేశం
కౌడిపల్లి, డిసెంబరు 2: మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాజునాయక్ అధ్యక్షతన ఎంపీడీవో అజారొద్దీన్ నేతృత్వంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరత పథకం ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు. గ్రామాల్లో చేపట్టిన పనులకు త్వరలోనే బిల్లులు మంజూరు చేయిస్తామని తెలిపారు. మిషన్ భగీరత నీటి విషయం ప్రతి సమావేశంలో చెబుతున్నా అమలుకు నోచుకోవడం లేదని వెంకట్రావ్పేట ఎంపీటీసీ సాజీదబేగం అన్నారు. గ్రామాల్లో నిర్మించిన వాటర్ ట్యాంకులకు ఇప్పటి వరకు కనెక్షన్ ఇవ్వలేదని తెలిపారు. సమావేశంలో వైస్ ఎంపీపీ నవీన్, జడ్పీటీసీ కవిత, తహసీల్దార్ రాణాప్రతాప్సింగ్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.