ఆ గ్రామంలో 34 మందే ఓటు వేశారు
ABN , First Publish Date - 2021-04-18T06:28:15+05:30 IST
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలను శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామస్తులు బహిష్కరించారు.
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలను శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామస్తులు బహిష్కరించారు. గ్రామాన్ని శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేయడంపై కొంతకాలంగా వివాదం రేగుతోంది. కోర్టు తీర్పు వెలువడక మునుపే విలీనంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. దీంతో లోక్సభ ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామపెద్దలు గురువారం రాత్రి దండోరా వేయించారు. శనివారం ఉదయం ఎన్నికలను బహిష్కరిస్తూ స్థానిక రామాలయం వద్ద యువకులు నిరసన తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రామ పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కరూ కన్పించలేదు. 3.30 గంటల ప్రాంతంలో తాము ఓటుహక్కు వినియోగించుకుంటామని ఎస్టీకాలనీకి చెందిన 15 మంది డిమాండ్ చేశారు. ఆ మేరకు పోలీసు బందోబస్తు నడుమ ఈ కాలనీకి చెందిన 34 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.