పాహిమాం.. పరమేశా

ABN , First Publish Date - 2021-03-09T07:11:38+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యప్రభ వాహనంపై వైభవంగా ఊరేగారు.

పాహిమాం.. పరమేశా
సూర్యప్రభపై ముక్కంటి, రథంపై జ్ఞానప్రసూనాంబ ఊరేగింపు

సూర్యప్రభ, భూతవాహనాలపై కైలాసనాథుడి విలాసం


శ్రీకాళహస్తి, మార్చి 8: శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యప్రభ వాహనంపై వైభవంగా ఊరేగారు. రథంపై కొలువుదీరిన జ్ఞానప్రసూనాంబ, మూషిక వాహనంపై వినాయకస్వామి, శ్రీవళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండీకేశ్వరుడు, భక్తకన్నప్ప చప్పరాలపై ఊరేగుతూ భవుడిని అనుసరించారు. ఊరేగింపులో పదాతిదళాలు, మంగళవాయిద్యాలు, మేళతాళాలు, కోలాటం, భజనబృందాల సందడి అలరించింది. సోమవారం రాత్రి జగద్రక్షకుడైన శివుడు భూతవాహనంపై పార్వతీదేవి శుకవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానప్రసూనాంబ చిలుక వాహనంపై, పంచమూర్తులు తమ వాహనాలపై కొలువుదీరి స్వామి వెంట నడిచారు. రాజగోపురం, నగరివీధి, బజారువీధి మీదుగా పార్వతీపరమేశ్వరుల ఊరేగింపు జరిగింది. పలుప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ముక్కంటీశుడికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, ఏఈవో ధనపాల్‌, ఏపీఆర్వో హరిబాబు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


అబ్బురం ఆషా నృత్యం

ముక్కంటీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి  ధూర్జటి కళాప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. శ్రీకాళహస్తికి చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆషా ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అతిథులను మంత్రముగ్ధులను చేసింది.



Updated Date - 2021-03-09T07:11:38+05:30 IST